శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 నవంబరు 2015 (15:04 IST)

శ్రీలంక వేదికగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్: ఎనిమిదేళ్ల తర్వాత క్రికెట్ పండగ?!

భారత్-పాకిస్థాన్ సిరీస్‌ వేదిక శ్రీలంకకు మారనుంది. భారత్‌లో ఆడేందుకు పీసీబీ ఒప్పుకోకపోవడంతో పాటు భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్‌లో ఆడేందుకు బీసీసీఐ కూడా అంగీకరించకపోవడంతో భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక సిరీస్‌కు శ్రీలంక వేదిక కానుందని తెలుస్తోంది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత జరిగే ఈ సిరీస్‌ను శ్రీలంకలో నిర్వహించేందుకు ఇరు జట్ల క్రికెట్ బోర్డులు సమాయత్తమవుతున్నాయి. 
 
ఈ క్రమంలో ఆదివారం దుబాయిలో బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్, పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్‌లు భేటీ అయ్యారు. ఇరు దేశాల క్రీడాభిమానులతో పాటు విశ్వవ్యాప్త క్రికెట్ ప్రేమికులు ఆశగా ఎదురు చూస్తున్న భారత్-పాక్ సిరీస్ నిర్వహణకు సంబంధించి వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.
 
వేదికలకు సంబంధించి ఒకరి ప్రతిపాదనను మరొకరు తిరస్కరించిన నేపథ్యంలో ఇరు దేశాలకు సమీపంలోని శ్రీలంకను వేదికగా చేసుకునే అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. శశాంక్, షహర్యార్‌ల చర్చల్లో పాలుపంచుకున్న ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధ్యక్షుడు గైల్స్ క్లార్క్ ఈ సిరీస్‌పై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.