శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 12 ఏప్రియల్ 2015 (12:55 IST)

డైనమెట్‌లా పేలిన మెక్‌కల్లమ్ : సన్‌రైజర్స్‌పై సీఎస్‌కే గ్రాండ్ విక్టరీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదో అంచె పోటీల్లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే జట్టు బ్యాట్స్‌మెన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్) డైనమెట్‌లా పేలిపోయాడు. ఫలితంగా ఐపీఎల్-8 ట్వంటీ-20 లీగ్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో సెంచరీ సాధించి ఐపీఎల్‌-8లో తొలి శతకం నమోదు చేశాడు..! ఇక నిప్పుకు వాయువు తోడైనట్టు బ్రెండన్‌కు ధోనీ (29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 53) జతకలిశాడు..! వీరిద్దరి విధ్వంసానికి స్కోరు బోర్డు రాకెట్‌లా దూసుకెళ్లింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత భారీ లక్ష్యఛేదనలో దక్కిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేక హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ ఓటమిని కొనితెచ్చుకుంది. ఫలితంగా45 పరుగుల తేడాతో ఓడిపోయింది. నిర్ణీత 20 ఓవర్లన్నీ ఆడి ఆరు వికెట్లకు 164 పరుగులే చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (42 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లతో 53) అర్థశతకంతో మెరవగా, శిఖర్‌ ధవన్‌ (26), కేన్‌ విలియమ్సన్‌ (26 నాటౌట్‌), రవి బొపారా (22) రాణించారు. చెన్నై బౌలర్లలో మోహిత్‌, బ్రావో చెరో రెండు వికెట్లు తీశారు. 
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 209 పరుగులు చేసింది. మెకల్లమ్‌ 100 (నాటౌట్), ధోనీ 53, డ్వేన్‌ స్మిత్‌ 27 రైనా (రనౌట్‌) 14, జడేజా (రనౌట్‌) 0, బ్రావో (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 15 చొప్పున పరుగులు వచ్చాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మెక్‌కల్లమ్‌కు దక్కింది.