బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 26 జూన్ 2017 (03:25 IST)

మిస్టర్ కూల్ కాదు మిస్ కూల్.. పుస్తకంతో కొట్టిన మిథాలీ రాజ్

ఆడుతున్నది బలమైన ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో అనే విషయం కూడా పట్టించుకోకుండా తాపీగా పుస్తకం చదువుతూ కూర్చుని పోజిచ్చింది మిథాలీరాజ్. ఓపెనర్లలో ఏ ఒక్కరు ఔటయినా తానే బ్యాటింగ్‌కు దిగాల్సిన పరిస్థితి. ప్యాడ్ క

ఆడుతున్నది బలమైన ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో అనే విషయం కూడా పట్టించుకోకుండా తాపీగా పుస్తకం చదువుతూ కూర్చుని పోజిచ్చింది మిథాలీరాజ్. ఓపెనర్లలో ఏ ఒక్కరు ఔటయినా తానే బ్యాటింగ్‌కు దిగాల్సిన పరిస్థితి. ప్యాడ్ కట్టుకునే ఉన్నప్పటికీ టెన్షన్‌కి గురికాలేదు. హాయిగా పుస్తకం చదువుకుంటూ గడిపింది. ఓపెనర్ ఔట్ కాగానే తాపీగా పుస్తకం అలా మడిచిపెట్టి బ్యాటింగ్‌కు వెళ్లింది. తాపీగా ఆడి అర్థసెంచరీ చేసింది. టీమ్‌కు అద్భుత విజయమూ దక్కింది. 
 
మిస్టర్ కూల్‌గా టీమిండియా పురుషుల జట్టులో ఎమ్ఎస ధోనీకి స్థితప్రజ్ఞుడిగా ఎంత పేరు ఉందో మహిళల జట్టులో అంత స్తిమితంగా ఉంటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది మిథాలీ రాజ్. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సరికొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే.  మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు సాధించి కొత్త అథ్యాయాన్ని లిఖించింది మిథాలీ. 
 
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన ఆరంభపు మ్యాచ్ లో మిథాలీ ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఇది మిథాలీ ఆన్ ఫీల్డ్ ప్రదర్శన మాత్రమే. అయితే మిథాలీ ఆఫ్ ఫీల్డ్ లో సైతం చూపరులను ఆకర్షించడం ఇక్కడ విశేషం. ఇంతకీ మిథాలీ ఏం చేసి అలా ఆకర్షించిందో తెలుసా.. కూల్‌గా పుస్తకాన్ని చదువుకుంటూ. ఒకవైపు వరల్డ్ కప్. అందులోనే ఇంగ్లండ్ వంటి కఠినమైన ప్రత్యర్థితో జరిగే పోరు. మిథాలీ ఏ మాత్రం ఒత్తిడికి లోనుకాలేదు.  
 
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు ఇన్నింగ్స్‌ను స్మృతీ మందనా, పూనమ్ రౌత్ ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్ కు 144 పరుగులు జోడించి భారత్ కు మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే వీరిలో ఏ ఒక్క వికెట్ పడ్డా ఫస్ట్ డౌనలో మిథాలీ రావాల్సి ఉంది. కాగా, ప్యాడ్లు కట్టుకుని ఉన్న మిథాలీ మాత్రం పుస్తకాన్ని చదువుతూ కూల్ గా కనిపించింది. దాంతో కెప్టెన్ కూల్ మిథాలీ రాజ్ అంటూ వార్తల్లోకికెక్కింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు 35 పరుగుల  తేడాతో గెలిచింది.
 
ఈ మ్యాచ్‌కు ముందు కేప్టెన్ల భేటీలో టీమిండియాలో మీకిష్టమైన క్రికెటర్ ఎవరు అని అడిగిన విలేఖరిపై ఘాటుగా ఎదురు ప్రశ్న వేసింది మిథాలి. ఇదే ప్రశ్న మీరు పురుష క్రికెటర్లను అడగగలరా.. మీకిష్టమైన మహిళా క్రికెటర్ ఎవరు అని మీరు వాళ్లను అడగరెందుకు అంటూ తీవ్రంగా స్పందించింది మిథాలి. ఆమె ఆవేదనకు అర్థం ఉంది మరి. దాదాపు 18  సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నా మిథాలి రాజ్ వచ్చిన ఆదాయం శూన్యం అనే చెప్పాలి. మహిళల క్రికెట్ పోటీలను టీవీల్లో కూడా చూపరు. ఎందుకీ వివక్ష అంటూ ఆమె సంధించిన ప్రశ్నకు ఎవరు జువాబు చెబుతారు మరి?

భారత కెప్టెన్‌ మిథాలీరాజ్‌ సూపర్‌ ఫామ్‌ ప్రపంచకప్‌లోనూ కొనసాగుతోంది. ఓపెనర్ల శుభారంభం అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ఆమె అర్ధ శతకంతో అదరగొట్టింది. వన్డేల్లో వరుసగా అమెకిది ఏడో ఫిఫ్టీ కావడం విశేషం. ఇది మహిళల వన్డే క్రికెట్‌లో కొత్త రికార్డు. గత ఆరు మ్యాచ్‌ల్లో మిథాలీ 62 నాటౌట్, 54, 51 నాటౌట్, 73 నాటౌట్, 64, 70 నాటౌట్‌ స్కోర్లు చేసింది. గతంలో రీలర్, ఎలీస్‌పెర్రీ, చార్లోటీ ఎడ్వర్డ్స్‌ వరుసగా 6 అర్ధసెంచరీలు చేశారు.