గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 2 ఫిబ్రవరి 2017 (01:55 IST)

ఆటగాళ్లను నమ్మితే ఫలితం చాహల్‌లా ఉంటుందా!

నిర్ణయాత్మక మూడో టీ 20లో లెగ్ బ్రేక్ బౌలర్ చాహల్ మాయాజాలం టీమిండియా విజయాన్నిసంపూర్ణం చేసింది. అతిథి జట్టు ఇంగ్లండ్‌పై టెస్ట్, వన్డే, టీ 20 సిరీస్‌లు మూడింటినీ భారత్ గెలుచుకుంది. చాహల్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బిల్లింగ్స్, రూట్, మోర్గాన్, స్టోక్స్, మొయి

నిర్ణయాత్మక మూడో టీ 20లో లెగ్ బ్రేక్ బౌలర్ చాహల్ మాయాజాలం టీమిండియా విజయాన్నిసంపూర్ణం చేసింది. అతిథి జట్టు ఇంగ్లండ్‌పై టెస్ట్, వన్డే, టీ 20 సిరీస్‌లు మూడింటినీ భారత్ గెలుచుకుంది. చాహల్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బిల్లింగ్స్, రూట్, మోర్గాన్, స్టోక్స్, మొయిన్ అలీ, జోర్డాన్‌ వికెట్లు పడగొట్టాడు. బెంగళూరు హీరో చాహల్.. టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శనల జాబితాలో చేరాడు. దులీప్ మెండిస్ రెండుసార్లు ఆరు వికెట్లు తీశాడు. ఓసారి 8 పరుగులు, రెండోసారి 16 పరుగులు ఇవ్వగా.. ఇప్పుడు చాహల్ 25 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మెండీస్ తర్వాత స్థానంలో చాహల్ నిలిచాడు.
 
తనకు ఎంతో అచ్చివచ్చిన బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో  టీమిండియా తరపున తొలి మ్యాచ్‌ను ఇంత గొప్పగా ముగించడం అద్భుతంగా ఉందని చాహల్ పేర్కొన్నాడు. ఈ స్టేడియంలో ఐపీఎల్‌లో కూడా పవర్ ప్లేకు ముందు బౌల్ చేసేవాడిని. విరాట్ కోహ్లీ నాపై విశ్వాసం ఉంచాడు. నేను సాధించగలనని చెప్పాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన మైదానం కాబట్టి ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ షాట్లకు సిద్ధపడతారని ఊహించి వికెట్లు తీయడానికి ప్రాధాన్యం ఇచ్చాను. పుల్ లెంగ్త్ బాల్స్ వేస్తూపోయాను. బ్యాట్స్‌మన్ బంతిని స్వీప్ మరియు రివర్స్ స్వీప్ చేసేటప్పుడు మిస్ అయితే ఎల్బీడబ్ల్యూ అయ్యే అవకాశం ఉంటుందనుకున్నాను. కానీ ఒకే మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీస్తానని కల్లో కూడ అనుకోలేదు అని చాహల్ మ్యాచ్ ముగిసిన అనంతరం పేర్కొన్నాడు. 
 
ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత బౌలర్లు నిజంగానే రెచ్చిపోయారు.  భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడిపోయారు. 13.2 ఓవర్ల వద్ద 2 వికెట్ల నష్టానికి 119 పరుగుల వద్ద ఉన్న ఇంగ్లాండ్ ఆ తర్వాత 13.3 ఓవర్లకే తడబడింది. మూడో వికెట్ రూపంలో మోర్గాన్ వెనుదిరిగాడు. ఆ తర్వాత 119 పరుగుల వద్దే నాలుగో వికెట్ రూపంలో రూట్ అవుటయ్యాడు. ఆ తర్వాత 119 పరుగుల వద్దే బట్లర్ రూపంలో ఇంగ్లాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 123 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా అలీ అవుటయ్యాడు. ఇక చివరలో 127 పరుగుల వద్ద ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో వికెట్లు పడ్డాయి. చాహల్, బుమ్రా, మిశ్రా మ్యాజిక్ చేసి ఇంగ్లాండ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు.
 
చాహల్, బుమ్రా, మిశ్రా ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ పేకమేడలా కూలిపోయారు. చాహల్ 4 ఓవర్లు వేసి 25 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. బుమ్రా 2.3 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మిశ్రా 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ ఇంగ్లాండ్ చేతులెత్తేసింది.