రోహిత్ శర్మ ద్వి డబుల్ సెంచరీలో స్ఫూర్తి : క్రిస్ గేల్ కామెంట్స్
వన్డే క్రికెట్ ఫార్మెట్లో రెండు సార్లు డబుల్ సెంచరీలు సాధించిన భారత క్రికెటర్ రోహిత్ శర్మే తనకు స్ఫూర్తి అని వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో మంగళవారం జింబాబ్వే జట్టుపై క్రిస్ గేల్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెల్సిందే. దీంతో వరల్డ్ కప్లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా గేల్ తన పేరును లిఖించుకున్నాడు.
ఈ సందర్భంగా గేల్ మాట్లాడుతూ వన్డేల్లో రోహిత్ శర్మ రెండు డబుల్ సెంచరీలు చేసినప్పటి నుంచి తాను డబుల్ సెంచరీ చేయాలని అనుకుంటూ వస్తున్నట్లు అతను తెలిపాడు. కాగా, జింబాబ్వేపై జరిగిన మ్యాచ్లో 16 సిక్సులు, పది ఫోర్లతో 215 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తొలి డబుల్ సెంచరీ సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు.
గత కొంతకాలంగా తాను తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టు చెప్పాడు. తాను డబుల్ సెంచరీ చేశాననే విషయం తెలియగానే ఆశ్చర్యం వేసిందని గేల్ అన్నాడు. డబుల్ సెంచరీ సాధించగలిగినందుకు దైవానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని, పరుగులు చేయాల్సిన తీవ్రమైన ఒత్తిడికి తాను గురవుతున్నానని, తనకు ఫోన్లోనూ ట్విట్టర్లోనూ విపరీతంగా మెసేజ్లు వస్తున్నాయని, దాంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యానని, ఇంతటి ఒత్తిడికి తాను ఇదివరకు ఎప్పుడూ గురి కాలేదని, చివరకు వారికి సమాధానం ఇవ్వడానికి అవకాశం దక్కిందని గేల్ అన్నాడు.
రోహిత్ శర్మ రెండు డబుల్ సెంచరీలు చేసినప్పటి నుంచి తాను ఒక్కటైనా చేయలేకపోయాననే గాయం సలుపుతోందని, ఆ కసితోనే ఇపుడు జింబాబ్వే జట్టుపై డబుల్ సెంచరీ సాధించినట్టు చెప్పుకొచ్చాడు. కాగా, ఇప్పటి వరకు రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ. వన్డేల్లో 264 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడు కూడా అతనే. 2014లో శ్రీలంకపై అతను ఈ స్కోరు సాధించాడు.