వరల్డ్ కప్ : 28న యూఏఈతో భారత్ మ్యాచ్.. పసికూనలపై ప్రతాపం చూపిస్తారా?
క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా శనివారం భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఈఏ) జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే భారత్ తానాడిన తొలి రెండు మ్యాచ్లలో విజయభేరీ మోగించి, గ్రూపు-బిలో అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం క్రికెట్ పసికూన యూఏఈతో తలపడనుంది. పెర్త్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఎమిరేట్స్ జట్టును చిత్తు చేసి గ్రూప్లో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది.
బ్యాటింగ్ లైనప్లో రోహిత్ తప్ప అందరూ ఫామ్లో ఉండటంతో ఈ మ్యాచ్లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం లేకపోలేదు. ధావన్, కోహ్లీ, రహానే... ఇలా ప్రధాన బ్యాట్స్మెన్ ఫామ్లో ఉండడంతో ఇప్పటివరకు అంతా సవ్యంగానే సాగింది. శనివారం జరిగే మ్యాచ్లో పెద్దగా పేరులేని యూఏఈ బౌలర్లు టీమిండియా లైనప్ను ఇబ్బంది పెట్టడం కష్టమే. బౌలర్లు కూడా సమయోచితంగా రాణించడం భారత్కు ప్లస్ పాయింట్.
అయితే, భారత ప్రధాన బౌలర్లలో ఒకరైన మహ్మద్ షమీ మోకాలి గాయం కారణంగా శనివారం యూఏఈతో జరిగే మ్యాచ్కు దూరమయ్యాడు. షమీ ఎడమ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని, చికిత్స తీసుకుంటున్నాడని, రేపటి మ్యాచ్కు అందుబాటులో ఉండడని బీసీసీఐ మీడియాకు తెలిపింది. కాగా, షమీ వైదొలగిన నేపథ్యంలో, ఆల్ రౌండర్ స్టూవర్ట్ బిన్నీ, యువ పేసర్ భువనేశ్వర్ కుమార్లలో ఒకరికి చాన్స్ దక్కనుంది. అయితే, భువీ ఫిట్నెస్పై సందేహాలు ఉండడంతో కెప్టెన్ ధోనీ ఫాంలో ఉన్న బిన్నీ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు.