శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2020 (08:08 IST)

అంతర్జాతీయ క్రికెటర్ అయినా.. వక్రబుద్ధి మారలేదు... కృనాల్ పాండ్యా నిర్బంధం

అతనో అంతర్జాతీయ క్రికెటర్. పైగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడు. మంచి క్రికెటర్ కూడా. కానీ ఆయనలోని వక్రబుద్ధి మారలేదు. యూఏఈ నుంచి ఎలాంటి ఆధారాలు, ఇన్వాయిస్‌లు లేకుండా పరిమితికి మించి బంగారాన్ని స్వదేశానికి తీసుకొచ్చారు. దీంతో ఆయన్ను ముంబై విమానాశ్రయం రెవెన్యూ నిఘా విభాగం (డీఆర్ఐ) పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఐపీఎల్‌ 2020 క్రికెట్‌ సంబరం​ ముగిసిన అనంతరం భారత్‌కు తిరిగి వస్తుండగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కృనాల్ పాండ్యాకు ఎదురుదెబ్బ తగిలింది. దుబాయ్‌ నుంచి బంగారంతోపాటు ఇతర విలువైన వస్తువులను అక్రమంగా తీసుకొస్తున్నారనే ఆరోపణలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు అతడిని అడ్డుకున్నాయి.
 
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చాడనే ఆరోపణలతో క్రునాల్ పాండ్యాను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నామని డీఆర్‌ఐ వర్గాలు తెలిపాయి. దీనిపై నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడించలేదు. 
 
కానీ పరిమితి కంటే ఎక్కువ బంగారం దీనితో పాటు మరికొన్ని విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్య సోదరుడైన కృనాల్‌ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మాన్, బౌలర్‌గా రాణిస్తున్నారు. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా పాండ్యా ప్రాతినిధ్యం వహించిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.