శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2015 (12:02 IST)

తొలి ట్వంటీ-20: టీమిండియాపై గెలుపు.. 7 వికెట్ల తేడాతో సఫారీలు అదుర్స్!

దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో సఫారీలే విజయకేతనం ఎగురవేశారు. ధర్మశాలలో జరిగిన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో సఫారీలనే విజయం వరించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తన సత్తా ఏంటో చూపిన సఫారీలు గెలుపును నమోదు చేసుకున్నారు. కొత్తగా తెరపైకి వచ్చిన ఫ్రీడం సిరీస్‌ను సఫారీలు విజయంతో ప్రారంభిస్తే, ధోనీ సేన మాత్రం పరాజయంతో ఆరంభించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాతో విజయం కోసం వెంపర్లాడినా దక్షిణాఫ్రికాదే పైచేయిగా నిలిచింది. 
 
ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సఫారీల జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో స్టైలిష్ బ్యాట్‌మన్స్ రోహిత్ శర్మ (66 బంతుల్లో 106 పరుగులు) వీరవిహారం చేశాడు. తనదైన స్టైలిష్ బ్యాటింగ్‌తో అతడు సఫారీ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 62 బంతుల్లోనే టీ20ల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్న అతడు టీమిండియాకు శుభారంభాన్నిచ్చాడు.
 
అయితే శిఖర్ ధావన్ (3) విఫలమయ్యాడు. కానీ విరాట్ కోహ్లీ (43) తనదైన శైలిలో రాణించినా అర్థ సెంచరీని పూర్తి చేసుకోలేకపోయాడు. రోహిత్ తో కలిసి సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా (14) మాంచి ఊపుమీదున్నట్లు కనిపించినా, త్వరలోనే పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (20) చివరిదాకా క్రీజులో నిలిచినా రైనా, రాయుడు(0)ల విఫలంతో పెద్దగా పరుగులేమీ రాబట్టలేకపోయాడు.
 
ఇక 200పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఇంకా రెండు బంతులు మిగిలివుండగానే గెలుపును నమోదు చేసుకుంది. కేవలం మూడు వికెట్లను కోల్పోయిన ఆ జట్టు సిరీస్‌లో శుభారంభం చేసింది. ఆమ్లా(36)తో కలిసి ఆ జట్టు బ్యాటింగ్‌ను ప్రారంభించిన స్టార్ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ (51) జట్టుకు శుభారంభాన్నిచ్చాడు.

తర్వాత కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ (4) విఫలమైనా, కొత్త ఆటగాడు ఫర్హాన్ బర్హదీన్ (32)తో కలిసి జేపీ డుమిని (34 బంతుల్లో 68 పరుగులు) వీర విహారం చేశాడు. జట్టుకు విజయాన్ని అందించాడు. చివరి వరకూ క్రీజులో కొనసాగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డుమినికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.