మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (02:35 IST)

మిస్టర్ కూల్ దోనీ యజమానులనే లెక్క చేయలేదా? అందుకే తప్పించారా?

పుణే ఐపీఎల్ జట్టు కేప్టెన్సీ నుంచి ధోనీని తొలగిస్తున్నట్లు యాజమాన్యం చెప్పగానే యావత్ క్రీడాలోకం బిత్తరపోయింది. కెప్టెన్‌గా ప్రదర్శన బాగాలేకున్నంత మాత్రాన ఇంత సడన్‌గా ధోనీ కెప్టెన్సీని వెనకా ముందూ చూడక

పుణే ఐపీఎల్ జట్టు కేప్టెన్సీ నుంచి ధోనీని తొలగిస్తున్నట్లు యాజమాన్యం చెప్పగానే యావత్ క్రీడాలోకం బిత్తరపోయింది. కెప్టెన్‌గా ప్రదర్శన బాగాలేకున్నంత మాత్రాన ఇంత సడన్‌గా ధోనీ కెప్టెన్సీని వెనకా ముందూ చూడకుండా తప్పించేస్తారా అనే ప్రశ్నలు, అనుమానాలు వెల్లువెత్తాయి. దీనికి తగ్గట్టుగానే  పుణే యాజమాన్యం ధోనీ తొలగింపు కారణాన్ని బయట పెట్టేసింది. మార్పు కోసమే అంటూ  స్మిత్‌ను ఎంపిక చేయడంకంటే దీని వెనక మరో బలమైన కారణం ఉండవచ్చని అందరిలో సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకా అనేక విషయాలు వెల్లడించారు. ధోని గురించి ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
జట్టు యజమానులైన తమను ధోని పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమని అర్థమవుతోంది. ఒక బెంగాలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ్యలో గోయెంకా మాట్లాడుతూ...‘ధోని మాకు ఫోన్‌లో కూడా ఎప్పుడూ అందుబాటులోకి రాలేదు. ఫ్రాంచైజీ కీలక సమావేశాలకు కూడా అతను రాలేదు. అతనితో మాట్లాడాలనుకున్న ప్రతీసారి ఏజెంట్‌ అరుణ్‌ పాండే ద్వారానే వెళ్లాల్సి వచ్చేది.గతేడాది లీగ్‌ సమయంలో అతను టీమ్‌ మీటింగ్‌లకు కూడా దూరంగా ఉన్నాడు. ఇందులో చర్చించిన ఫీల్డింగ్‌ను ధోని మ్యాచ్‌లో పూర్తిగా మార్చేశాడు. అతను ఆ సమావేశంలో లేకపోవడం వల్ల ఏం జరిగిందో కూడా ధోనీకి తెలీదని ఒక సీనియర్‌ ఆటగాడు మాకు చెప్పాడు’ అని గోయెంకా కుండబద్దలు కొట్టారు. 
 
జట్టు నెట్‌ ప్రాక్టీస్‌లకు కూడా మహి హాజరు కాలేదని, లెగ్‌స్పిన్నర్‌ ఆడం జంపాను తుది జట్టులోకి తీసుకోమంటే తాను అతని ఆటను ఎప్పుడూ చూడలేదని చెప్పడం తమకు ఆశ్చర్యం కలిగించిందని పుణే యాజమాన్యం పేర్కొంది. దేశవాళీలో మంచి ప్రదర్శన లేకపోయినా ఫ్రాంచైజీపై ఒత్తిడి తెచ్చి సౌరభ్‌ తివారిని బలవంతంగా జట్టులోకి తీసుకోవడంతో పాటు టీమ్‌ జెర్సీ రంగు, డిజైన్‌కు సంబంధించి ధోని ఇచ్చిన సూచనలను యాజమాన్యం పట్టించుకోలేదు.
 
క్రికెటేతర అంశాల్లో కూడా అతను జోక్యం చేసుకొనేంత అధికారం అతని చేతుల్లో ఇవ్వరాదని ఆర్‌పీజీ టీమ్‌ భావించింది. దాంతో మార్పు అనివార్యమంటూ జనవరిలోనే ధోనికి సమాచారం ఇవ్వగా, ‘మీరు ఏది సరైందని అనిపిస్తే అది చేయండి. ఇది మీ నిర్ణయం. నేను ఆటగాడిగానే ఉంటాను’ అని ధోని అప్పుడే చెప్పినట్లు తెలిసింది. ‘సామాన్య అభిమానులకు ఈ నిర్ణయం నచ్చదని మాకు తెలుసు. కానీ ఇదే సరైంది. నేను నిజాలను ఎప్పుడైనా మొహం మీదే చెప్పేస్తాను. ఫ్రాంచైజీ మేలు కోసమే ధోనిని తప్పించాం’ అని గోయెంకా స్పష్టం చేశారు.