గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 17 జులై 2017 (08:10 IST)

సెహ్వాగ్‌కు కూడా గుండు కొట్టింది కోహ్లీనేనా... ఏం బతుకురా స్వామీ నీది..!

టీమిండియా కోచ్‌ పదవి ఎంపిక వెనుక జరిగిన పరిణామాలు ఒక్కొక్కటీ బయటపడుతూంటే మన జట్టులో స్టార్ ఆటగాళ్లు, కెప్టెన్ పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. భారత క్రికెట్ సలహా మండలి సబ్యులైన దిగ్గజ ఆటగాళ్లు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌ల ఏకాభిప్రాయం కూడా కోహ్లీ మ

టీమిండియా కోచ్‌ పదవి ఎంపిక వెనుక జరిగిన పరిణామాలు ఒక్కొక్కటీ బయటపడుతూంటే మన జట్టులో స్టార్ ఆటగాళ్లు, కెప్టెన్ పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. భారత క్రికెట్ సలహా మండలి సబ్యులైన దిగ్గజ ఆటగాళ్లు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌ల ఏకాభిప్రాయం కూడా కోహ్లీ మాట ముందు దిగదుడుపే అవుతోందని తెలుస్తోంది. కోచ్ పదవికి దరఖాస్తు దాఖలు చేసిన వారిలో వీరేంద్ర సెహ్వాగ్ తన ప్రజెంటేషన్తో అదరగొట్టే ప్రదర్శన ఇచ్చినా అతడి ప్రతిపాదన ఒకటి ప్రధాన కోచ్‌గా అతడి అవకాశాన్నే అడ్డుకుందని క్రికెట్ ప్రేమికులు నివ్వెరపోతున్నారుట
 
ప్రధాన కోచ్‌గా తాను ఏమేమి, ఎలా చేయాలనుకుంటున్నానో కూలం కషంగా తెలియజేస్తూ ఇంటర్వ్యూ సందర్భంగా వీరూ ఇచ్చిన ప్రజంటేషన్‌ సచిన్‌, గంగూలీ, లక్షణ్‌ల కమిటీని ఎంతగానో ఆకట్టుకుంది. అతని కి కెప్టెన్‌ కోహ్లీ మద్దతు కూడా లభించింది. కుంబ్లే కాకుండా మరెవరైనా తమకు ఓకేనని భారత జట్టు ఇతర సభ్యులూ అన్నారు. అయినా.. చివరకు వీరూకు నిరాశే ఎదురైంది. అందుకు సెహ్వాగ్‌ చేసిన ఓ ప్రతిపాదనే కారణంగా తెలుస్తోంది! 
 
ఐపీఎల్‌లో కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ జట్టుకు మెంటార్‌గా పనిచేసిన అనుభవంతో కోచ్‌ పదవికి దరఖాస్తు చేయాలని వీరూ నిర్ణయించుకున్నాడు. అంతకుముందే.. సారథి కోహ్లీ అభిప్రాయం తీసుకోగా.. అతనూ ఒకే అన్నాడట. అయితే, కింగ్స్‌ లెవెన్‌కు చెందిన ఫిజియో అమిత్‌ త్యాగి, సహాయ కోచ్‌ మిథున్‌ మన్హాస్‌లను సహాయక సిబ్బందిగా తనతోపాటు తెచ్చుకుంటానని వీరూ ప్రతిపాదించినట్టు సమాచారం. 
 
కానీ ఇది కోహ్లీకి నచ్చనట్టు తెలిసింది. ‘ప్రస్తుత సహాయక సిబ్బంది చాలాకాలంగా జట్టుతో కొనసాగుతున్నారు. వారు ప్రతి సభ్యుడితో ఎంతో కలిసిపోయారు. ఒక్కో ఆటగాడికి ఏమేమి అవసరమన్న విషయాలూ వారికి బాగా తెలుస’ని వీరూతో విరాట్‌ అన్నట్టు సమాచారం. సరిగ్గా.. ఈ విషయంలో పావులు కదిపిన రవిశాస్ర్తి కోచ్‌ రేస్‌లో ముందంజలో నిలిచినట్టు బోర్డు వర్గాలు వెల్లడించాయి. జట్టు అవసరాలతో పాటు క్రికెటర్లు కోరుకునే సహాయక సిబ్బందితో తాను సర్దుకుపోగలనని కోహ్లీకి శాస్ర్తి చెప్పినట్టు తెలిసింది.
 
‘మూడేళ్లుగా జట్టు సహాయక సిబ్బంది అందిస్తున్న సేవలను గుర్తించి వారితో కొనసాగేందుకు శాస్ర్తి సుముఖత వ్యక్తంజేయడం కూడా అతడికి కలిసి వచ్చింద’ని వివరించాయి. మొత్తంగా ఇంటర్వ్యూ బోర్డును ఆకట్టుకున్నప్పటికీ వీరూ చేసిన ఓ ప్రతిపాదనే అతడికి అవకాశాలకు గండికొట్టిందన్నమాట!
 
ఆటగాళ్లు ఫలానా వాడైతే మాకు సరిపోతాడు అని చెబితే చాలు.. వెంటనే వారి మాటే చెల్లుబాటయ్యే పరిస్థితి టీమిండియాలో, బీసీసీఐలో ఏర్పడింది. మొత్తంమీద బీసీసీఐ కోరలు తీసిన పులిలాగా మారిపోయిందన్నది వాస్తవం. కోహ్లీ మాట కాదంటే ఏమి జరుగుతుందో కుంబ్లే అనుభవంతోనే గ్రహించిన రవిశాస్త్రి క్రికెటర్లు కోరుకునే సహాయక సిబ్బందితో తాను సర్దుకుపోగలనని చెప్పగానే కోహ్లీ ఆమోదముద్ర వేశాడు. అదే టీమిండియా కోచ్ ఎంపికకు కొలమానం అన్నమాట. కుంబ్లే, సచిన్, గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్ దిగ్గజాలని పేరుపడిన అందరికీ భంగపాటు కలుగుతున్నా బీసీసీఐ నిద్రపోతూనే ఉంది.