గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2015 (13:25 IST)

ఫాంలో ఉండగానే రిటైర్ కానున్న సంగక్కర: భారత్‌తో జరిగే ఆ మ్యాచే లాస్ట్!

15 సంవత్సరాలుగా శ్రీలంక క్రికెట్‌కు మూలస్తంభంగా నిలిచిన గ్రేట్ బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర. క్రికెట్ ఐకాన్ అయిన సంగక్కర ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. గురువారం భారత్‌తో ఆడనున్న 134వ మ్యాచే సంగక్కర చివరి టెస్టు. ఐతే ఆటతీరు దిగజారకుండానే ఫాంలోనే ఉండగానే రిటైర్ కానున్నాడు. వికెట్‌ కీపర్‌గా బ్యాట్స్‌మన్‌గా లంకకు ఎనలేని సేవ చేశాడు. శ్రీలంక ఆటగాళ్లలో అర్జున రణతుంగ, అరవింద్‌ డిసిల్వా తర్వాత అంతటి పేరుతెచ్చుకున్న క్రికెటర్ ఎవరైనా ఉన్నాడంటే అది సంగక్కర అనే చెప్పాలి.
 
పరుగుల దాహమే సంగాను మేటి బ్యాట్స్‌మెన్‌‌గా తీర్చిదిద్దింది. కష్ట సమయాల్లో ఆదుకునే బ్యాట్స్ మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన దశలో కూడా ఒడ్డున చేర్చిన ఎన్నో సందర్భాలున్నాయి. అదే అతన్ని స్టార్ క్రికెటర్‌ని చేసింది. 37 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన సంగక్కర ఇప్పటివరకు 133 టెస్టులు ఆడి 57.71 సగటుతో 12,350 పరుగులు సాధించాడు.
 
టెస్టు క్రికెట్‌లో 38 సెంచరీలతో అత్యధిక పరుగులు సాధించి టాప్‌-5 జాబితాలో చోటు సంపాధించాడు. టెస్టుల్లో 11 సార్లు 200 పరుగులకు పైగా స్కోరు చేసిన లెజెండ్ క్రికెటర్. ట్రిపుల్‌ సెంచరీ కూడా అతని జాబితాలో ఉంది. 12 డబుల్‌ సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా లెజెండ్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ రికార్డుకు అడుగు దూరంలో ఆగిపోయాడు. టీ-20 వరల్డ్‌కప్‌ నెగ్గి 20-20 మ్యాచ్‌లకు వీడ్కోలు పలికిన సంగా.. వన్డేలకు కూడా గ్రాండ్‌గానే గుడ్‌బై చెప్పాడు. 
 
భారత్‌పై విజయం సాధించి గ్రేట్‌ బ్యాట్స్‌మన్‌ సంగాకు ఘనంగా వీడ్కోలు పలకాలని లంక టీం కృత నిశ్చయంతో ఉంది. తొలి టెస్టులో భారత్‌పై విజయం సాధించిన తర్వాత.. సిరీస్‌ విజయాన్ని సంగాకు గిఫ్ట్‌గా ఇస్తామని కెప్టెన్‌ మాథ్యూస్‌ ఇప్పటికే ప్రకటించాడు.