శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 15 మే 2019 (10:54 IST)

ఆంధ్రప్రదేశ్ మహిళకు అరుదైన గౌరవం.. ఐసీసీ రిఫరీగా ఎంపిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జీఎస్ లక్ష్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఐసీసీ రిఫరీగా నియమితులైంది. ఇప్పటివరకు పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా అంపైర్‌గా క్లారీ పొలోసక్(ఆస్ట్రేలియా) రికార్డు నెలకొల్పింది. 
 
ఇపుడు తాజాగా భారత్‌కు చెందిన జీఎస్ లక్ష్మి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్ రిఫరీల ప్యానెల్లో చోటు దక్కించుకున్న మొదటి మహిళగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో లక్ష్మి రిఫరీగా వ్యవహరించే అవకాశం వెంటనే అమల్లోకి రానున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. 
 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన 51 యేళ్ళ లక్ష్మి తన సొంత రాష్ట్రం ఆంధ్రతో పాటు బీహార్, ఈస్ట్‌జోన్, రైల్వేస్, సౌత్ జోన్ జట్లకు ప్రాతినిధ్యం వహించింది. కుడిచేతి బ్యాటింగ్‌తో పాటు ఫాస్ట్ మీడియం బౌలింగ్‌తో చిరస్మరణీయ విజయాల్లో కీలకమైంది. 
 
క్రికెటర్‌గానేకాకుండా 2008-09 మహిళల దేశవాళీ క్రికెట్ సీజన్‌లో తొలిసారి మ్యాచ్ రిఫరీగా లక్ష్మి బాధ్యతలు నిర్వర్తించింది. దీనికి తోడు మూడు అంతర్జాతీయ వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లకు రిఫరీగా విధులు చేపట్టింది. దీనిపై ఆమె స్పందిస్తూ, ఐసీసీ అంతర్జాతీయ ప్యానెల్ చేత రిఫరీగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందనీ, మరింత ఎత్తుకు ఎదిగేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు.