శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 28 అక్టోబరు 2018 (12:43 IST)

పూణె వన్డే: కోహ్లీ సెంచరీ... వెస్టిండీస్ విజయం

ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పూణెలో జరిగిన వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ అది వృధాగా మారింది. 
 
తొలి వన్డేలో ఓటమిని ఎదుర్కొని.. రెండో వన్డేలో మ్యాచ్‌ను టైగా ముగించిన విండీస్.. మూడో వన్డేలో ఏకంగా ఆతిథ్య భారత్‌ను మట్టికరిపించింది. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటిన కరీబియన్ టీమ్ ఐదు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆ జట్టు ఆటగాళ్లు ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ మినహా మిగతా బౌలర్లు ధారళంగా పరుగులిచ్చారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 283 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో షెయ్ హోప్(95) కీలక సమయంలో గొప్పగా రాణించాడు. ఆఖర్లో నర్స్(40) ఆ జట్టుకు మెరుపు ముగింపునిచ్చాడు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 47.4 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. 
 
దీంతో విండీస్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (107: 119 బంతుల్లో 10ఫోర్లు, సిక్స్) అద్భుత శతకం వృథా అయింది. శిఖర్ ధావన్(35) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో మార్లోన్ శామ్యూల్స్ మూడు, జాసన్ హోల్డర్, మెకాయ్, నర్స్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.