శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (11:28 IST)

పాక్ కెప్టెన్ మిస్బా స్వార్థపరుడు : షోయబ్ అక్తర్ విమర్శలు!

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో వరుస ఓటములతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ జట్టు మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ మిస్బావుల్ హక్‌పై ఘాటైన విమర్శలు చేశాడు. 
 
మిస్బా చాలా పిరికి వ్యక్తి, అతనికి స్వార్థం ఎక్కువ. అందువల్లే పాక్ విఫలం అవుతోందంటూ విమర్శించాడు. ఈ విషయాన్ని తాను చాలా కాలం నుంచి చెబుతూనే ఉన్నానని, ఘోర వైఫల్యం దిశగా సాగుతున్నామని, ఇదంతా మిస్బా వంటి సారథి వల్లేనని మండిపడ్డారు. తక్షణం జట్టు కోచ్ వకార్ యూనిస్, చీఫ్ సెలక్టర్ మొయిన్ ఖాన్‌లను తొలగించాలని, మొత్తం క్రికెట్ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. 
 
కేవలం తన ప్రదర్శన, తన పరుగులు, బ్యాటింగ్ స్థానంపై మాత్రమే మిస్బా దృష్టి ఉంటుందని విమర్శించారు. అయితే, పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ మాత్రం జట్టును వెనకేసుకొచ్చాడు. తిరిగి పాకిస్థాన్ పుంజుకుంటుందని తెలిపారు. తొలుత ఇండియాతో, ఆపై వెస్టిండీస్‌పై ఘోరంగా ఓడి తదుపరి రౌండుకు చేరే అవకాశాలను క్లిష్టం చేసుకున్న విషయం తెల్సిందే.