శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (12:06 IST)

#dhonipleaseretire అన్నారు.. నాకేం ఢోకా లేదు.. ప్రపంచ కప్ తర్వాత కూడా ఆడుతా...

క్రికెట్‌ నుంచి ఇప్పట్లో తప్పుకునే ప్రసక్తే లేదని.. భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ చెప్పకనే చెప్పేశాడు. ఈ ఏడాది జరుగనున్న ప్రపంచ కప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వచ్చిన వార్తలకు ధోనీ చెక్ పెడుతూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌ ఆధారంగా చెప్పాలంటే మాత్రం 2019 వరల్డ్‌కప్‌ తర్వాత కూడా ఆడగలనని మహేంద్రుడు అన్నాడు. 
 
35 ఏళ్లు దాటిన ధోనీ.. ప్రపంచ కప్ కూడా ఆడతానని చెప్పేశాడు. ఒకవేళ అది జరిగితే మహీ నాలుగు ప్రపంచ కప్‌ల్లో పాల్గొన్న ఆటగాడిగా రికార్డుకెక్కే అవకాశం వుంది. ఇంకా త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచకప్ పోటీల్లో ధోనీ వికెట్ కీపర్‌గా మరిన్ని రికార్డులను సాధించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ.. ప్రపంచ కప్ తర్వాత కూడా క్రికెట్ ఆడుతానని.. తన ఫిట్‌నెస్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ధోనీ వ్యాఖ్యానించాడు.
 
ఇకపోతే.. తొలి టీ20లో ధోనీ ఎక్కువ బంతులు ఆడి పరుగులు చేయకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. పిచ్‌ కఠినంగా ఉంది సరే సింగిల్స్‌ ఎందుకు తీయలేదని నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపించారు. ధోనీ ఇక రిటైర్మెంట్ ప్రకటించవచ్చునని.. ప్లీజ్ రిటైర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. 
 
భారత్‌ తరఫున ధోనీకి ఇదే చివరి టీ20 కావొచ్చని కొందరు కొత్త వాదనలకు తెరతీశారు. వన్డే ప్రపంచకప్‌ తర్వాత అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని పుకార్లు వస్తున్నాయి. సెలక్టర్లు సైతం ప్రపంచకప్‌ తర్వాత ప్రదర్శన ఆధారంగానే ఎవరికైనా జట్టులో చోటు దక్కుతుందని స్పష్టం చేశారు.
 
ఈ విమర్శల నేపథ్యంలో ఆసీస్‌తో జరిగిన రెండో టీ-20లో ధోనీ కొత్త రికార్డు సాధించాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 350 సిక్సర్లు బాదిన భారత తొలి బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ధోనీ తన ప్రతాపం చూపించాడు. 23 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. మూడు కళ్లు చెదిరే సిక్సర్లు, మూడు బౌండరీలు బాదేశాడు.
 
ఈ క్రమంలోనే అతడు టీ20 కెరీర్‌లో 50 సిక్సర్ల రికార్డు సాధించాడు. ఇలా కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ రాణిస్తున్న ధోనీ ప్రపంచకప్ తర్వాత కూడా ఆడేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించాడు.