శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (16:23 IST)

టాస్‌కు గుడ్‌బై... ఒకే బంతికి రెండు వికెట్లు.. ఎలా?

క్రికెట్‌లో భారీ సంస్కరణలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి శ్రీకారం చుట్టనుంది. ముఖ్యంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ముందు... ఈ కీలక మార్పులు చేయాలని ఐసీసీ భావిస్తోంది. ఈ విషయాన్ని ఐసీసీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 
 
ఈ సంస్కరణల్లో భాగంగా, ఐసీసీ తాను చేయాలనుకుంటున్న ఆలోచనలను అభిమానులు ముందు ఉంచింది. వీటిలో ఏ మార్పులు మీరు ఎక్కువగా కోరుకుంటున్నారంటూ చివరి ట్వీట్‌లో ఫ్యాన్స్‌ను ప్రశ్నించింది. యువతకు క్రికెట్‌ను మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
 
ఇందులోభాగంగా గతంలో కనీవినీ ఎరగని విప్లవాత్మక మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నది. జులై 2019, జూన్ 2021 మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ నుంచి ఈ మార్పులను ప్రవేశపెట్టనుంది. అందులో భాగంగా టెస్టుల్లో ప్లేయర్స్ జెర్సీలపై వాళ్ల ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌ను ఉంచాలన్నది ఒక ప్రతిపాదన.
 
అలాగే, ఇక క్రికెట్‌లో టాస్‌కు కూడా గుడ్ బై చెప్పనుంది. టాస్‌కు బదులుగా ట్విట్టర్ పోల్ నిర్వహించనున్నారు. దీనివల్ల అభిమానులే ఎవరు మొదట బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయాలన్నది ట్విట్టర్ పోల్ ద్వారా నిర్ణయించే అవకాశం దక్కనుంది.
 
అంతేకాదు ఒకే బాల్‌కు రెండు వికెట్లు తీసే అవకాశం కల్పించనుంది. అంటే ఓ బాల్‌కు బ్యాట్స్‌మన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న తర్వాత అవతలి బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేసే వీలు కూడా కల్పించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
 
ఇన్నాళ్లూ క్రికెట్‌లో కామెంటేటర్లు అంటే గ్రౌండ్ బయట ఏసీ రూముల్లో కూర్చొని కామెంట్రీ చెప్పేవారు. కానీ తాజాగా ఐసీసీ ప్రతిపాదన ప్రకారం వాళ్లు నేరుగా ఫీల్డ్‌లో అడుగుపెట్టవచ్చు. మ్యాచ్ జరుగుతుంటే.. స్లిప్ ఫీల్డర్ వెనకాల నిలబడి కామెంట్రీ ఇవ్వొచ్చు. ఇలాంటి పెను మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టనుంది.