శ్రీలంక జట్టుపై టీమిండియా అదుర్స్: రోహిత్ శర్మ, ధావన్ అదుర్స్..సిరీస్ సమం!
జార్ఖండ్లో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ జట్టు అదరగొట్టింది. శ్రీలంక జట్టుపై టీమిండియా దుమ్మురేపింది. పదునైన బ్యాటింగ్తో టీమిండియా సిరీస్ను సమం చేసింది. తద్వారా ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. మూడు టీ20ల సిరీస్లో శుక్రవారం రాంచీలో జరిగిన రెండో మ్యాచ్లో ధోనీ సేన సత్తా చాటింది.
టాస్ గెలిచిన లంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుని ఆతిథ్య దేశ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. భారత జట్టు ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఓపెనర్ రోహిత్ శర్మ (47) తనదైన స్టయిల్లో రాణిస్తే, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (51) వచ్చీ రావడంతోనే బ్యాటింగ్ అదరగొట్టారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ కూడా తమ వంతు పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
ఆ తర్వాత 197 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకకు తొలి బంతితోనే రవిచంద్రన్ అశ్విన్ షాకిచ్చాడు. లంక స్టార్ బ్యాట్స్ మన్ తిలకరత్నే దిల్షాన్(0)ను ధోనీ స్టంప్ ఔట్ చేశాడు. ఆ తర్వాత రెండో ఓవర్లో రెండో వికెట్, నాలుగో ఓవలో మూడో వికెట్ను చేజార్చుకున్న లంక కష్టాల్లో పడింది. ఇదే అదనుగా టీమిండియా బౌలర్లు తమదైన శైలిలో రాణించి వరుసగా వికెట్లు తీశారు.
తద్వారా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి లంక 127 పరుగులు మాత్రమే సాధించగలిగింది. దీంతో శ్రీలంకపై టీమిండియా 69 పరుగులతో విజయం సాధించినట్లైంది. తొలి టీ20లో పరాజయం పాలైన టీమిండియా, ఈ విజయంతో సిరీస్ను సమంచేసింది. ఇక ఈ నెల 14న విశాఖలో జరగనున్న మూడో టీ20లో విజయం సాధించే జట్టునే సిరీస్ వరించనుంది.