శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (17:26 IST)

ధోనీ అవుటయ్యాక స్టేడియం 70శాతం ఖాళీ అయిపోయింది...!

టీమిండియాపై క్రికెట్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగినా యావత్తు క్రికెట్ ఫ్యాన్స్ ఆసీస్‌కు వెళ్లి టీమిండియాకు బూస్ట్ ఇవ్వాలనుకుంటే.. టీమిండియా మాత్రం గెలవాల్చిన మ్యాచ్‌ను చేజార్చుకుంది. ప్రపంచకప్ పోటీ సందర్భంగా స్వదేశానికి మద్దతునిచ్చేందుకు భారతీయులు మెల్ బొర్న్ క్రికెట్ స్టేడియంకి పోటెత్తారు. 
 
42 వేల సామర్థ్యం కలిగిన ఎంసీజీ స్టేడియంలో సుమారు 31 వేల మంది భారతీయ అభిమానులే అంటే టీమిండియాకు స్టేడియంలో మద్దతు ఏ స్థాయిలో లభించి ఉంటుందో అంచనావేయవచ్చు. భారత్ బౌలింగ్ చేసినా, బ్యాటింగ్ చేసినా ఆస్ట్రేలియాలోని ఎంసీజీలో వినిపించిన నినాదం ఒకటే...ఇండియా, ఇండియా, ఇండియా...విదేశాల్లో టీమిండియాకు ఇంత గొప్పమద్దతు ఇంకెక్కడా లభించలేదంటే అతిశయోక్తి కాదేమో. 
 
అభిమాన జట్టును ప్రోత్సహించేందుకు భారతీయులు ఎక్కడెక్కడి నుంచో స్టేడియంకి చేరుకున్నారు. ఎంత ప్రోత్సహించినా టీమిండియా ఆటతీరు తీసికట్టుగా మారడంతో అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. కోహ్లీ అవుటవ్వడంతో కొంత మంది అభిమానులు కన్నీరు పెట్టుకోవడం విశేషం. 
 
ధోనీ అవుటయ్యాక స్టేడియం 70 శాతం ఖాళీ అయిపోయింది. అంతేకాదు.. కోహ్లీ బాధ్యతారహితంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుష్క గ్యాలరీలో కూర్చోవడంతో కోహ్లీ ఏదో బ్యాటింగ్ ఝుళిపిస్తాడనుకున్న ఫ్యాన్స్‌కి నిరాశే మిగిలింది. బౌలింగ్ చేస్తున్నప్పుడు క్యాచ్‌ను మిస్ చేయడం.. బ్యాటింగ్‌లో రాణించకపోవడంతో ఫ్యాన్స్ అంతా నిరాశ చెందారు. కానీ వున్నంతలో మెరుగ్గా ఆడిన ధోనీ ఆడేంతవరకు క్రికెట్ అభిమానులు స్టేడియంలో ఉన్నారు. ధోనీ ఎప్పుడైతే రనౌట్ అయ్యాడో అప్పుడే ఫ్యాన్స్ అంతా బ్యాగులెత్తుకుని బయల్దేరేశారు.