శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (12:04 IST)

తొలి వన్డే : శ్రేయాస్ - రాహుల్ కుమ్మేశారు.. కివీస్ టార్గెట్ 348

Shreyas Iyer
భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా, బుధవారం సెడాన్ పార్క్ వేదికగా కివీస్‌తో తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్లు బ్యాట్‌తో పని చెప్పారు. దీంతో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ కోహ్లీ అర్థ సెంచరీ చేయగా శ్రేయాస్ అయ్యర్ తన కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అలాగే, కేఎల్ రాహుల్ 88 (నాటౌట్) పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేసేందుకు తన వంతు పాత్రపోషించాడు. మ్యాచ్ చివరల్లో కేదార్ జాదవ్ మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదడంతో జట్టు స్కోరు అమాత్రం 347 పరుగులకు చేరింది. కివీస్ బౌలర్లలో సోథీ రెండు వికెట్లు, గ్రాండ్‌హోమ్, సోదీ చెరో వికెట్ తీశారు. 
 
అంతకుముందు భారత జట్టు కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెరీర్‌లో తొలి వన్డే ఆడుతున్న పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్.. తొలి వికెట్‌కు 50 పరుగులు భాగస్వామ్యం సాధించారు. పృథ్వీ షా తన వ్యక్తిగత స్కోర్ 20 పరుగుల దగ్గర గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ కొద్దిసేపటికే మయాంక్(32) అవుట్ అయ్యాడు. 
 
ఆ పిమ్మట క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 51 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 156 పరుగుల దగ్గర మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే, యువ క్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌ల జోడీ ఆచితూచి ఆడుతూ.. జట్టు భారీ స్కోర్ సాధించేందుకు తోడ్పడ్డారు. ఇదే క్రమంలో 107 బంతుల్లో 103 పరుగులు చేసిన శ్రేయాస్ భారీ షాట్‌కు యత్నించి సాట్నర్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత లోకేశ్‌కు కేదార్ జాదవ్ జత కలిశాడు. ఇద్దరూ కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. 
 
మ్యాచ్ ఆకరులో కేదార్ జాదవ్ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 15 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐదో వికెట్‌కు ఈ ఇద్దరి జోడీ 56 పరుగుల భాగస్వామ్యం సాధించింది. కివీస్ బౌలర్లలో సోథీ రెండు వికెట్లు, గ్రాండ్‌హోమ్, సోదీ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ జట్టు ముంగిట 348 పరుగుల విజయలక్ష్యాన్ని భారత జట్టు ఉంచింది.