శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (10:47 IST)

డర్బన్‌లో సఫారీలను చితక్కొట్టిన కోహ్లీ సేన

సొంత గడ్డపై వరుసగా 17 మ్యాచ్‌లు నెగ్గిన జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు టీమిండియా దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. అలాగే ఇక్కడి కింగ్స్‌మీడ్‌ మైదానంలో తమ చెత్త రికార్డును సవరించుకుంటూ తొలి విజయాన్ని అందుకుంది

సొంత గడ్డపై వరుసగా 17 మ్యాచ్‌లు నెగ్గిన జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు టీమిండియా దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. అలాగే ఇక్కడి కింగ్స్‌మీడ్‌ మైదానంలో తమ చెత్త రికార్డును సవరించుకుంటూ తొలి విజయాన్ని అందుకుంది. విరాట్‌ కోహ్లీ (119 బంతుల్లో 10 ఫోర్లతో 112) శతకానికి తోడు రహానె (86 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 79) క్లాస్‌ ఇన్నింగ్స్‌ జత కలవడంతో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్‌ నెగ్గింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో 268 పరుగులు చేసింది. ఆ తర్వాత కింగ్స్‌మీడ్‌ మైదానంలో 270 పరుగుల లక్ష్యమా..? కష్టమే అన్న విశ్లేషకుల అంచనాలను కోహ్లీ సేన తారుమారు చేస్తూ, గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఈ స్టేడియంలో ఇదే అత్యధిక లక్ష్యఛేదన కావడం విశేషం. 
 
అంతకుముందు పేసర్లకు అనుకూలిస్తుందనుకున్న ఈ పిచ్‌పై అనూహ్యంగా భారత స్పిన్నర్లు కుల్దీప్‌, చాహల్‌ రాజ్యమేలారు. అయితే 134 పరుగులకే ఐదు వికెట్లు పడినా కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఒంటరి పోరాటంతో శతకం బాది దక్షిణాఫ్రికాకు గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు. ఆ తర్వాత 269 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కోహ్లీ సేన... 45.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఈ విజయంతో ఆరు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజ వేసింది.