శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 నవంబరు 2015 (15:30 IST)

బెంగుళూరు టెస్ట్ : మూడో రోజు ఆట వర్షార్పణం.. డ్రా దిశగా పయనం

ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజైన సోమవారం ఆట కూడా పూర్తిగా తుడిసిపెట్టుకుని పోయింది. ఈ మ్యాచ్ ఈనెల 14వ తేదీన ప్రారంభమైన విషయంతెల్సిందే. ఈ మ్యాచ్‌కు తొలి రోజున ఆటంకం కలిగించిన వరుణదేవుడు.. రెండో రోజు మాత్రం అడ్డుకున్నాడు. ఫలితంగా ఒక్క బంతి కూడా పడకుండా ఆట రద్దు అయింది. మూడో రోజైన సోమవారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. స్టేడియం పరిసరాల్లో సోమవారం ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తుండటంతో మూడోరోజు ఆట ప్రారంభం కాలేదు. పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ కొనసాగే అవకాశం లేదంటూ... మూడోరోజూ ఆట రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
 
ఈ క్రమంలో వరుసగా ఆదివారం, సోమవారం రెండు రోజుల్లో ఒక్క బంతి కూడా పడలేదు. ఆటకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మంగళవారమైనా ఆటకు వాతావరణం అనుకూలిస్తుందనే ఆశలు అంతగా లేవు. ఒక వేళ ఏదో ఒక సమయంలో ప్రారంభమైనా, ఆట సజావుగా కొనసాగుతుందన్న అంచనాలు కూడా లేవు. దీంతో, ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో వైపు, తొలి రోజు ఆటలో దక్షిణాఫ్రికా 214 పరుగులకు ఆలౌట్ కాగా... టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 80 పరుగులు చేసి మెరుగైన స్థితిలో ఉంది. మురళీ విజయ్ (28), శిఖర్ ధావన్ (45) క్రీజులో ఉన్నారు.