మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (16:34 IST)

నాగ్‌పూర్ టెస్ట్ : భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 173 ఆలౌట్... సౌతాఫ్రికా టార్గెట్ 310

నాగ్‌పూర్‌ టెస్టులో ఈ దఫా భారత బ్యాట్స్‌మెన్స్ వంతు వచ్చింది. దక్షిణాఫ్రికా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులకు ఆలౌట్ కాగా, ఇపుడు భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌట్ అయింది. ఏది ఏమైనా భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యంతో కలుపుకుని సఫారీల ముంగిట 310 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. మరో మూడు రోజుల ఆట మిగిలివుంది. 
 
ఓవర్ నైట్ స్కోరు 11/2తో రెండో రోజు ఉదయం ఆటను ప్రాంభించిన సఫారీలు... భారత స్పిన్నర్ల ధాటికి నిలువలేక పోయారు. ఫలితంగా కేవలం 79 పరుగులకే ఆలౌట్ అయ్యారు. సఫారీ బ్యాట్స్‌మెన్లలో ఎల్గర్ 7, వాన్ జిల్ 0, తాహీర్ 4, ఆమ్లా 1, డీ విల్లియర్స్ 0, ప్లెసెస్ 10, డుమ్నీ 35, విలాస్ 1, హార్మెర్ 13, రబడా 6 (నాటౌట్), మోర్కెల్ 1 చొప్పున పరుగులు చేశారు. ఫలితంగా భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో అమూల్యమైన 136 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. కాగా, సఫారీల తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 32 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అలాగే జడేజా 33 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
 
ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌట్ అయింది. భారత ఆటగాళ్ళలో ఓపెనర్లు విజయ్ 5, ధావన్ 39, పుజరా 31, కోహ్లీ 16, రహానే 9, రోహిత్ శర్మ 23, షా 7, జడేజా 5, అశ్విన్ 7 మిశ్రా 14 చొప్పున పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్ 5 వికెట్లు తీయగా, మోర్కెల్ 3, హార్మెర్, డుమ్నీ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన సఫారీలు 17 పరుగులకు తన తొలి వికెట్‌ను కోల్పోయింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 215 పరుగులు చేసింది.
 
అయితే, దక్షిణాఫ్రికా ముందు 310 పరుగుల విజయ లక్ష్యం ఉండగా, 'స్పిన్' హీరోగా మారిన పిచ్‌పై ఇది అసాధ్యమైన లక్ష్యమేనని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఆట ఇంకా మూడు రోజులకు పైగా మిగిలివుండగా, వరుణుడు అడ్డుపడితే తప్ప మ్యాచ్ డ్రా అయ్యే పరిస్థితిలో లేదు.