శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2015 (15:43 IST)

భజ్జీ ''పాగల్'' అయ్యాడనుకుంటా: సెహ్వాగ్ నవ్వుతూ కామెంట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ పోరాడినా ముంబైని గెలిపించుకోలేకపోయాడు. భజ్జీ భీకరమైన బ్యాటింగ్ చేశాడు. దీని పైన వీరేంద్ర సెహ్వాగ్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. హర్భజన్ సింగ్ 'పాగల్' అయ్యాడని నవ్వుతూ సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.
 
భజ్జీ దూకుడు పైన స్పందించమని మ్యాచ్ అనంతరం కోరగా... 'ఈ రోజు సర్దార్ (భజ్జీ) పిచ్చోడిగా మారాడనుకుంటున్నా' అని నవ్వుతూ వ్యాఖ్యానించాడు. సెహ్వాగ్, హర్భజన్ సింగ్ స్నేహితులు. ఆ చొరవతోనే భజ్జీ రెచ్చిపోయి ఆడటాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. కాగా అంతకుముందు ఇన్నింగ్సులో సెహ్వాగ్ 19 బంతుల్లో 36 పరుగులు చేశాడు.
 
కాగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఆ తర్వాత ముంబై 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. 18 పరుగుల తేడాతో ఓడింది. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినప్పటికీ ఆ జట్టు ఆటగాడు భజ్జీ అందర్నీ ఆకట్టుకున్నాడు. 24 బంతుల్లో 64 పరుగులు (ఐదు ఫోర్లు, 6 సిక్స్‌లు) చేశాడు. 19 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు.