శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr

ఐపీఎల్ టోర్నీ : రోహిత్ విజృంభణ... కోల్‌కతాపై అద్భుత విజయం

తనకెంతో అచ్చొచ్చే చారిత్రక ఈడెన్‌ గార్డెన్స్‌లో రోహిత్‌ శర్మ అజేయ అర్థసెంచరీతో కదంతొక్కడంతో ఐపీఎల్‌లో ముంబై బోణీ కొట్టింది. భారీ లక్ష్యం నిర్దేశించినా సొంతగడ్డపై గంభీర్‌సేన (కోల్‌కతా) తొలి ఓటమి చవిచూసింది. 
 
నిజానికి ఈ గార్డెన్స్‌లో ముంబై ఇండియన్స్‌కు మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకు కోల్‌కతాపై ఐదు మ్యాచ్‌ల్లో లక్ష్యఛేదనకు దిగితే అన్నింటా ముంబైదే విజయంగా నిలిచింది. ఇందులో నాలుగు మ్యాచ్‌లు 160పైగా స్కోర్లు నమోదైనా ముంబై అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. మరోవైపు తన అభిమాన మైదానంగా ముద్రపడిన ఈడెన్‌లో రోహిత్‌ శర్మ (84 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో చెలరేగిన వేళ ముంబై 6 వికెట్లతో ఘనవిజయం సాధించింది. 
 
కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ముంబై 19.1 ఓవర్లలో 4 వికెట్లుకోల్పోయి విజయాన్నందుకుంది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రోహిత్‌ శర్మ (54 బంతుల్లో 84 నాటౌట్) బాధ్యాతయుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఆది నుంచే కోల్‌కతా బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రోహిత్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో అలరించి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. 
 
అంతకుముందు టాస్ నెగ్గిన ముంబై కెప్టెన్ రోహిత్‌ శర్మ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కెప్టెన్ గంభీర్ (64), మనీశ్‌పాండే (52) అర్థ సెంచరీలతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.