మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 13 మే 2015 (14:15 IST)

ఢిల్లీ ధాటికి చెన్నై ఓటమి: శ్రేయాస్ అయ్యర్ 70.. యువీ 32 రన్స్‌తో అదుర్స్!

కాసుల పంట పండించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ సీజన్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ విజేతగా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ సత్తా చాటింది. చెన్నై ఆటగాళ్లకు చుక్కలు చూపించింది. ఢిల్లీ ధాటికి చెన్నై బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టేందుకు చెమటోడ్చారు. ఈ క్రమంలో చెన్నై 119 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితం కాగా, ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ రాణించిన ఢిల్లీ అలవోక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 
 
టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకోగా, నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి చెన్నై 119 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (29), కెప్టెన్ ధోనీ (27) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ మొత్తం స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. జహీర్ ఖాన్, అల్బీ మోర్కెల్ పదునైన బంతులతో చెలరేగారు. 
 
ఆ తర్వాత 120 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 16.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఢిల్లీ ఓపెనర్ శ్రేయాస్ అయ్యర్ మరోసారి చెలరేగాడు. 49 బంతుల్లో అతడు 10 ఫోర్లు, ఓ సిక్స్ సహాయంతో 70 పరుగులు సాధించాడు. యువరాజ్ సిగ్ (32) కూడా రాణించడంతో ఢిల్లీ అలవోకగానే విజయం సాధించింది.