శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (19:11 IST)

ఐపీఎల్ వేలం: పవన్ నేగి టాప్-సచిన్ బేబీ డౌన్.. రూ.9.5 కోట్లకు షేన్ వాట్సన్!

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం పాట జోరుగా సాగుతోంది. ఈ వేలం పాటలో బెంగళూరు మాజీ ఆటగాడు కరణ్ నాయర్ అనూహ్య ధర పలికాడు. గత సీజన్లో పది లక్షల రూపాయలకు ఇతనిని కొనుగోలు చేయగా, ఈ దఫా రూ.4 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది.

ఇక గత సీజన్లో రూ. 30 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన పవన్ నేగీని రూ.8.5 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. తద్వారా అత్యధిక పారితోషికానికి అమ్ముడు పోయిన ఆటగాళ్ల జాబితాలో నేగి స్థానం సంపాదించుకున్నాడు. కేవలం రూ.10లక్షల ధరకు కేరళకు చెందిన సచిన్ బేబీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఈసారి వేలంలో ఇదే అత్యల్ప ధర కావడం గమనార్హం. 
 
ఇకపోతే.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో చెన్నై, రాజస్థాన్ జట్ల స్థానంలో రాజ్ కోట్, గుజరాత్ జట్లు రంగప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. వేలం సందర్భంగా కొన్ని జట్లు ఖరీదైన ఆటగాళ్లను వదులుకోగా, ఆ డబ్బుతో కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి.

ఈ క్రమంలో జట్లలో పలు మార్పులు చోటుచేసుకోవడం జరిగింది. కాగా రాజస్థాన్ తరపున ఆడిన షేన్ వాట్సన్‌ను 9.5 కోట్ల రూపాయలు వెచ్చించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.