శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 30 మే 2016 (16:28 IST)

ఐపీఎల్ బెట్టింగ్.. కట్టుకున్న భార్యను తాకట్టు పెట్టిన కలియుగ ధర్మరాజు.. ఎక్కడ?!

ఐపీఎల్ బెట్టింగ్‌లో ఓడిపోయాడని కట్టుకున్న భార్యనే తాకట్టు పెట్టేశాడు ఓ కలియుగ ధర్మరాజు. ఈ వింత ఘటన యూపీలోని కాన్పూర్ జిల్లా గోవింద్ నగర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం గోవింద్ నగర్‌లో ఉంటున్న ఓ వ్యక్తి ఐపీఎల్ బెట్టింగులు కాస్తూ తన ఆస్తిని మొత్తం కోల్పోయాడు. ఆస్తిని పోగొట్టుకున్నా కూడా ఈ ప్రబుద్ధుడికి జూదంపై మోజు తీరక ఏకంగా తన భార్యను పణంగా పెట్టి బెట్టింగ్ కాసి ఓడిపోయాడు. దీంతో అతడిపై గెలిచిన గ్యాంబ్లర్స్ ఆ మహిళను వేధింపులకు గురిచేశారు. 
 
బెట్టింగ్‌లో ఓడిపోయిన నీవు మా కోరికలు తీర్చాలంటూ ఆ మహిళపై వేధింపులు మొదలు పెట్టారు. ఆ గ్యాంబ్లర్స్ వేధింపులు భరించలేక ఆ మహిళ సామాజిక కార్యకర్తల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తరుచూ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, తన భర్తతోపాటు, గ్యాంబ్లర్స్‌పై పోలీసులకి ఫిర్యాదు చేసింది. అంతేకాదు పెళ్లైన ఐదేళ్లనుండి తనకి నరకం చూపిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. 
 
పెళ్లైన మొదటిరోజే నగలు, విలువైన వస్తువులను బలవంతంగా తీసుకుని జూదం ఆడేవాడని.. ఈ ఐదేళ్లలో ఇంట్లో ఏ వస్తువు లేకుండా అమ్మేశాడని వాపోయింది. చివరికి తనని కూడా జూదంలో అమ్మకానికి పెట్టాడని కన్నీరుమున్నీరయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు. షేర్ మార్కెట్‌లో డబ్బులన్నీ పోగొట్టుకున్న నిందితుడు చివరకు ఐపీఎల్ బెట్టింగ్‌లో భార్యని ఓడిపోయాడని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెల్లడించారు.