చరిత్రాత్మక టెస్టులో చెలరేగిన భారత స్పిన్నర్ జడేజా... కుప్పకూలిన కివీస్
కాన్పూర్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ దేశాల మధ్య జరుగుతున్న చరిత్రాత్మక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో చెలరేగిపోయాడు. దీంతో కివీస్ జట్టు 95.5 ఓవర్లలో 262 పరుగుల
కాన్పూర్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ దేశాల మధ్య జరుగుతున్న చరిత్రాత్మక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలంతో చెలరేగిపోయాడు. దీంతో కివీస్ జట్టు 95.5 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ కు 56 పరుగుల లీడ్ లభించింది.
ఈ టెస్ట్ మ్యాచ్ మూడోరోజైన శనివారం 152/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ జట్టు భారత స్పిన్నర్లు జడేజా (5/73), అశ్విన్ (4/93) ధాటికి 262 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో అంతకముందు 318 పరుగులకు తొలి ఇన్నింగ్స్లో ఆలౌటైన భారత్కు 56 పరుగుల ఆధిక్యం లభించింది. శుక్రవారం విఫలమైన అశ్విన్, జడేజాలు శనివారం తొలి సెషన్ ఆరంభం నుంచే వికెట్ల వేటను మొదలెట్టేశారు.
అప్పటికే అర్ధశతకాలు సాధించిన లాథమ్ (58), కేన్ విలియమ్సన్ (75)తో పాటు రాస్ టేలర్(0)లు వరుసగా 11 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్ చేరిపోగా.. అనంతరం వచ్చిన లూక్ రోంచి (38), శాంట్నర్ (32) భారత స్పిన్నర్ల ముందు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఒకవైపు వాట్లింగ్ (21) ఒంటరిగా చివరి వరకూ పోరాడినా.. మరో ఎండ్లోని టెయిలెండర్లను వరుస బంతుల్లో జడేజా పెవిలియన్ పంపి కివీస్ను కోలుకోలేని దెబ్బ తీశాడు.
ముఖ్యంగా ఇన్నింగ్స్ 95వ ఓవర్ వేసిన జడేజా రెండో బంతికి క్రైయిగ్ (2), మూడో బంతికి ఇష్ సోధి (0), చివరి బంతికి బోల్ట్ (0)లను పెవిలియన్కు పంపేశాడు. తర్వాత ఓవర్లోని ఐదో బంతికి వాట్లింగ్ను అశ్విన్ ఔట్ చేయడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. భారత్ బౌలర్లలో జడేజా 5, అశ్విన్ 4, ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ తీశారు.