శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2016 (12:44 IST)

మేం హంతకులమో, టెర్రరిస్టులమో అన్న భావన కలిగింది : ఎంఎస్ ధోనీ

భారత మీడియాపై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫైర్ అయ్యాడు. 2007 వన్డే వరల్డ్‌క్‌పలో భారత్‌ పేలవ ప్రదర్శనపై దేశంలోని ఓ వర్గం మీడియా స్పందించిన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. మీడియా వ్యవహారశ

భారత మీడియాపై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫైర్ అయ్యాడు. 2007 వన్డే వరల్డ్‌క్‌పలో భారత్‌ పేలవ ప్రదర్శనపై దేశంలోని ఓ వర్గం మీడియా స్పందించిన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. మీడియా వ్యవహారశైలి తాను హంతకుడినో లేక ఉగ్రవాదినో అన్న భావన కలిగేలా చేసిందన్నాడు. తన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'ఎమ్‌ఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమా ప్రమోషన్‌లో భాగంగా న్యూయార్క్‌ సిటీలో జరిగిన ఈవెంట్‌లో మహీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
 
నాడు రాహుల్‌ ద్రావిడ్‌ నేతృత్వంలోని జట్టు 2007 వరల్డ్‌ కప్‌లో ఆరంభ మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌ చేతిలో, ఆపై శ్రీలంక చేతిలో ఓడిపోయి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. దీంతో, వెస్టిండీస్‌ నుంచి జట్టు నిరాశగా స్వదేశానికి చేరుకోవడాన్ని ధోనీ గుర్తు చేసుకున్నాడు. పటిష్ట భద్రత మధ్య ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన తమను మీడియా చుట్టు ముట్టిందన్నాడు. జట్టు సభ్యులను మీడియా ప్రతినిధులు వెంబడించారన్నాడు. అప్పుడు మీడియా వ్యవహరించిన తీరు తనను ఒక మనిషిగా, క్రికెటర్‌గా చాలా ప్రభావితం చేసిందని చెప్పాడు. 
 
మీడియా కార్లు పెద్ద పెద్ద లైట్లు అమర్చిన కెమెరాలతో మమ్మల్ని అనుసరిస్తున్నాయి. మా వాహనం వెంటపడుతున్నాయి. వాళ్లను చూస్తే మేమేదో పెద్ద నేరం చేసినట్టుగా అనిపించింది. మేం హంతకులమో, టెర్రరిస్టులమో అన్న భావన నాలో కలిగింది. కొద్ది దూరం తర్వాత మేం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాం. మేం కావాలనే అక్కడికి వెళ్లాం. 15-20 నిమిషాలు అక్కడ కూర్చొని మా కార్లలో ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నాం. ఈ తతంగం అంతా నాపై చాలా ప్రభావం చూపింద’ని చెప్పుకొచ్చాడు.