గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR

చెన్నై సూపర్ కింగ్స్‍‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం.. రెండోసారి టైటిల్ వశం

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ - 8 సీజన్ ఫైనల్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు గెలుపొంది విజేతగా నిలిచింది. 
 
ఈ మ్యాచ్‌లో విజంయ సాధించి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ టైటిలును ఎగరేసుకుపోవాలన్న ధోనీ సేన కల కలగానే ముంబై ఇండియన్స్ కుర్రోళ్లు మిగిల్చారు. ఐపీఎల్ పోరులో ఆరోసారి ఫైనలుకు చేరిన ఏకైక జట్టుగా ఉన్న చెన్నైలో డ్వేన్‌ స్మిత్‌, రైనా, ధోనీ వంటి హిట్టర్లున్నా ముంబై ముందు నిలువలేకపోయారు. 
 
టాస్ గెలిచి ప్రత్యర్థి జట్టుకు ధోనీ బ్యాటింగ్ అప్పగించి పెద్ద పొరపాటే చేశాడు. రెండో ఓవర్లో మొదలైన ముంబై బాదుడు చివరి వరకూ కొనసాగగా, నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. లెండిల్‌ సిమన్స్‌ 68, రోహిత్‌ శర్మ 50 పరుగులతో అర్థ సెంచరీలు సాధించగా, కీరన్‌ పొలార్డ్‌ 36, అంబటి రాయుడు 36 (నాటౌట్‌)తో జట్టు స్కోరుని రెండొందలు దాటించారు. 
 
ఆ తర్వాత 203 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై చతికిలపడింది. 161 పరుగులతో సరిపెట్టుకుంది. దీంతో ముంబై 41 పరుగుల తేడాతో విజయం సాధించి, విజేతగా నిలిచింది. ఇది ఆ జట్టుకు రెండో టైటిల్ కావడం గమనార్హం. గతంలో హర్భజన్ సింగ్ నేతృత్వంలో ఒకసారి, ఇపుడు రోహిత్ శర్మ సారథ్యంలో రెండోసారి టైటిల్ విజేతగా నిలిచింది.