బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2015 (09:46 IST)

పాకిస్థాన్ బ్యాటింగ్.. బౌన్సర్లతో భయపెడుతున్న ఆస్ట్రేలియా బౌలర్లు!

వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా శుక్రవారం ఆడిలైడ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు తమ బౌన్సర్లతో విరుచుకుపడుతున్నారు. దీంతో పాక్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోతున్నారు. 
 
ఐదు, ఆరో ఓవర్లలో వరుసగా పాక్ జట్టు ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు. జట్టు స్కోరు 20 పరుగులకు చేరగానే తొలి వికెట్ కోల్పోయిన పాక్, మరో నాలుగు పరుగులు చేసి రెండో వికెట్‌ను కోల్పోయింది. పాక్ స్టార్ బ్యాట్స్‌మన్‌గా వెలుగొందుతున్న సర్ఫరాజ్ అహ్మద్ (10) మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో షేన్ వాట్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే అహ్మద్ సెహజాద్ (5) కూడా జోస్ హ్యాజిల్ వుడ్ బౌలింగ్‌లో క్లార్క్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 
 
అలాగే, పాకిస్థాన్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌ పట్ల దేవుడు కరుణించాడు. హక్ బ్యాటింగ్ చేస్తుండగా, హజ్లీవుడ్ వేసిన 5వ ఓవర్ 3వ బంతి లెగ్ సైడ్ వెళ్తూ, మిస్బా ప్యాడ్‌ను ఆపై స్టంప్స్‌ను తాకుతూ వెళ్లింది. దీంతో స్టంప్స్, బెయిల్స్‌లో ఉన్న ఎల్ఈడీ లైట్లు కూడా వెలిగాయి. కానీ బెయిల్స్ మాత్రం కింద పడలేదు. అప్పటికే 2 వికెట్లు తీసి జోరుమీదున్న ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు ఒక్క క్షణం సంబరాలు చేసుకొని, ఆ పై విషయం తెలిసి సర్దుకున్నారు. మిస్బా కు లభించిన ఈ లైఫ్‌ను అతను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. ప్రస్తుతం పాకిస్థాన్ స్కోర్ 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు.
 
అంతకుముందు ఆస్ట్రేలియా నగరం ఆడిలైడ్ లోని ఓవల్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు ఆసీస్‌కు బౌలింగ్ అప్పగించింది. భారత్‌తో సెమీ ఫైనల్‌లో తలపడే జట్టును నిర్ధారించనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి.