డిసెంబరులో మాతో క్రికెట్ ఆడుతారో లేదో తేల్చేయండి: పీసీబీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లేఖ రాసింది. డిసెంబరులో మాతో క్రికెట్ ఆడుతారో లేదో తేల్చి చెప్పాలని పీసీబీ ఆ లేఖలో క్లారిటీ ఇవ్వాలని కోరింది. క్రీడలు, రాజకీయాలు, ద్వైపాక్షిక సంబంధాలను వేర్వేరుగా చూడాలని పీసీబీ లేఖలో బీసీసీఐకి సూచించింది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో ఆడాల్సిన మూడు వన్డేలు, రెండు టెస్టులను నిర్వహించేందుకు సహకరించాలని పీసీబీ, బీసీసీఐని కోరింది.
తటస్థ వేదికపై భారత్ తో పాక్ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించేందుకు పీసీబీ తహతహలాడుతోంది. ముంబై పేలుళ్ల తర్వాత ప్రపంచ కప్ మ్యాచ్ మినహా భారత్-పాక్ల మధ్య మ్యాచ్ జరగలేదు. ఈ నేపథ్యంలో భారత్తో మ్యాచ్లు నిర్వహిస్తే కష్టాల్లో ఉన్న పీసీబీకి భారీగా ఆదాయం చేకూరుతుందని పీసీబీ భావిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్న పాకిస్థాన్తో ఆడేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయట్లేదు. మరి భారత్-పాక్ల మధ్య మ్యాచ్లు జరుగుతాయో లేవో వేచి చూడాలి.