సచిన్కు అరుదైన గౌరవం: లారెస్ అకాడమీలో చోటు!
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక లారెస్ ప్రపంచ క్రీడా అకాడమీలో మాస్టర్కు చోటు లభించింది. సచిన్తో పాటు చైనా బాస్కెట్ బాల్ స్టార్ యావో మింగ్, జిమ్నాస్ట్ షియాపింగ్, స్కేటర్ యాంగ్ యాంగ్, కెన్యా మారథాన్ రన్నర్ టెగ్లా లోరోప్లను కూడా ఈ జాబితాలో స్ధానం లభించింది. బుధవారం జరిగిన ఈ వేడుకల్లో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్, ఇథోపియా స్పింటర్ జెంజెబీ డిబాబాకు లారెస్ స్పోర్ట్స్ మెన్, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు దక్కాయి.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ "లారెస్ అకాడమీలో చోటు దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నేను చూస్తుండగానే ఎదిగిన వారితో వేదికను పంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది" అని చెప్పాడు. గతంలో భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్లు ఈ గౌరవం పొందారు.
ఇక సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్కు తన సేవలందించిన సంగతి తెలిసిందే. భారత్ తరపున 200 టెస్టు మ్యాచ్లు, 463 వన్డే మ్యాచ్లాడిన ఒకే ఒక ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రమే కావడం గమనార్హం. ప్రపంచ క్రికెట్లో 100 సెంచరీలు చేసిన ఏకైక వ్యక్తి సచిన్ టెండూల్కరే. వన్డేల్లో అత్యధిక స్కోరు 200 పరుగులు. టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా, వన్డేల్లో 49 సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.