గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2015 (16:42 IST)

మహారాష్ట్ర టైగర్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్ ...

మహారాష్ట్ర పులుల అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వ్యవహరిస్తారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి సచిన్‌కు మధ్య ఒప్పందం కుదరనుంది. మహారాష్ట్రలో పెద్ద పులుల సంరక్షణ ప్రాజెక్టుకు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు సచిన్ అంగీకరించారు. రాష్ట్రంలో పులుల మనుగడ ప్రమాదంలో పడిందని, వాటి రక్షణకు అందరూ నడుం బిగించాలని, ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని మహారాష్ట్ర సర్కారు భావించింది. 
 
ప్రజలు ఇలాంటి విషయాల్లో భాగస్వాములవ్వాలంటే వారిని ఆకర్షించగల వ్యక్తులు అవసరమని సర్కారు అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, అటవీశాఖ మంత్రి సుధీర్ ముంగాంతివార్ పలువురు ప్రముఖులకు లేఖలు పంపారు. ఆయన లేఖకు స్పందించిన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన సమ్మతి తెలిపారు. తాజాగా, సచిన్ కూడా ముంగాంతివార్ లేఖకు సానుకూలంగా స్పందించారు. పులుల సంరక్షణకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 
 
తాను పులుల అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు తన అంగీకారం తెలుపుతూ మంత్రికి ఓ లేఖ రాశారు. అందులో.. ప్రాజెక్ట్ టైగర్ కోసం మీరు చేస్తున్న కృషిని అభినందిస్తున్నట్టు తెలిపారు. దీనిపై మిమ్మల్ని కలవనుండడం సంతోషదాయకం. క్రికెట్ ఆడే రోజుల్లో పులుల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు నా టెస్టు సెంచరీల్లో ఒకదాన్ని అంకితమిచ్చాను కూడా అని సచిన్ తన లేఖలో స్పష్టంచేశారు.