కొలంబో టెస్టు : 4 ఓవర్లలోనే రెండు వికెట్లు డౌన్.. లంకేయుల అదుర్స్!
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాట్స్మెన్లకు శ్రీలంక బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. శ్రీలంక, భారత్ల మధ్య జరిగే మూడో టెస్టు మ్యాచ్ ఆరంభంలోనే లంక బౌలర్లు టీమిండియాకు షాకిచ్చారు. తొలి ఓవర్లో భారత ఓపెనర్ లోకేశ్ రాహుల్ (2)ను లంక ఫేసర్ దమ్మిక ప్రసాద్ పెవిలియన్ చేర్చాడు. తొలి ఓవర్ను నో బాల్తో మొదలుపెట్టిన దమ్మిక ప్రసాద్ తన రెండో బంతికే లోకేశ్ రాహుల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఆ తర్వాత రాహుల్ స్థానంలో క్రీజులోకి వచ్చిన అజింక్యా రెహానే (8) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. నాలుగో ఓవర్ నాలుగో బంతికి నువాన్ ప్రదీప్కు వికెట్ల ముందు రెహానే దొరికిపోయాడు. దీంతో నాలుగు ఓవర్లు పూర్తి కాకుండానే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి భారత్ 15 పరుగులు చేసింది.
అంతకుముందు శ్రీలంక రాజధాని కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన ఆతిథ్య లంక జట్టు తొలుత బ్యాటింగ్కు రావాలని టీమిండియాను ఆహ్వానించింది. ఇప్పటిదాకా జరిగిన రెండు టెస్టులలో చెరో టెస్టు గెలిచిన ఇరు జట్లు సమఉజ్జీవులుగానే ఉన్నాయి. ఈ టెస్టులో నెగ్గిన జట్టు టైటిల్ను కైవసం చేసుకుంటుంది.