మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (22:49 IST)

భారత్‌పై సఫారీల సవారీ : ఆడుతూపాడుతూ లక్ష్యఛేదన... ట్వంటీ-20 సిరీస్ కైవసం

భారత్‌పై సఫారీలు సవారీ చేశారు. సొంత మైదానాల్లో భారత ఆటగాళ్లు సింహాల్లా గర్జిస్తారని ప్రతి ఒక్కరూ చెపుతుంటారు. కానీ, సఫారీల ధాటికి భారత సింహాలు.. మైదానంలో పిల్లులుగా మారిపోయాయి. ఫలితంగా కటక్ వేదిగా జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సమిష్టిగా చేతులెత్తేసింది. ఒక్కరంటే ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా పట్టుమని పది పరుగులు చేయలేక పోయారు. 
 
కేవలం ఓపెనర్ రోహిత్ శర్మ (22), సురేష్ రైనా (22)లు మాత్రమే చెప్పుకోదగిన స్కోరు చేయగా, ధవాన్, అశ్విన్‌లు 11 పరుగుల చొప్పున చేయగా ఎక్స్‌ట్రాల రూపంలో మరో 11 రన్స్ వచ్చాయి. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అంతా అటొచ్చి.. ఇటెళ్లిపోయారు. కోహ్లీ 1, ధోనీ 5, పటేల్ 9 చొప్పున పరుగులు చేయగా, మరో ముగ్గురు డకౌట్ అయ్యారు. 
 
వీరిలో అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్‌లు ఉన్నారు. టీమిండియా ఆటగాళ్ల సమిష్టి చెత్త బ్యాటింగ్ కారణంగా భారత్ జట్టు 17.2 ఓవర్లలో అన్ని వికెట్లను సమర్పించుకుని 92 పరుగులకే చాపచుట్టేసింది. సఫారీ బౌలర్లలో మోర్కెల్ 3, మోరీస్, తాహీర్‌లు రెండేసి, రబడా ఒక వికెట్ చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 93 పరుగుల సులభతరమైన విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 6 వికెట్ల తేడాతో అలవోకగా లక్ష్యాన్ని చేరుకుంది. ఆ జట్టులో ఓపెనర్లు డీవిల్లియర్స్ 19, ఆమ్లా 2, ప్లెసిస్ 16, డుమ్నీ 30, బెహర్డిన్ 11, మిల్లర్ 10 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఆశ్విన్ మాత్రమే రాణించి మూడు, పటేల్ ఒక్క వికెట్ తీశాడు. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌ను సఫారీ జట్టు కైవసం చేసుకుంది.