సుప్రీం కోర్టులో అనురాగ్ ఠాకూర్పై శ్రీనివాసన్ పిటిషన్
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ల మధ్య రచ్చ మళ్లీ మొదలైంది. శ్రీనిని బోర్డు సమావేశాలకు అనుమతించడంపై స్పష్టత కావాలంటూ బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్లో పేర్కొన్న అంశాల ఆధారంగా ఠాకూర్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తాజాగా శ్రీనివాసన్ తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు.
బోర్డు పిటిషన్లో ఠాకూర్ సమర్పించిన స్టేట్మెంట్లు, తప్పుడు అఫిడవిట్లు కోర్టును తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని శ్రీని ఆరోపించాడు. ఆగస్టు 28న జరిగిన వర్కింగ్ కమిటీ మీటింగ్కు శ్రీని బలవంతంగా హాజరయ్యాడని పిటిషన్లో ఠాకూర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ టీమ్ చెన్నైకి వాటాలు బదలాయింపులు జరిగిన ట్రస్టులో శ్రీనివాసన్ సభ్యుడుని, ఇది కచ్చితంగా పరస్పర విరుద్ధ లాభం కిందకు వస్తుందని కూడా బోర్డు పేర్కొంది.
అయితే ఇదంతా తప్పుడు సమాచారమని శ్రీని కౌంటర్ దాఖలు చేశాడు. అందుకు సాక్ష్యంగా బోర్డు కోశాధికారి అనిరుధ్ చౌదరి, ఉపాధ్యక్షుడు టీసీ మాథ్యూస్, కేరళ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి జయేష్ జార్జ్ల అఫిడవిట్లను జత చేశాడు.