ధోనీ ఫిక్స్ చేశాడని నేను చెప్పానా.. హవ్వా!: సునీల్ దేవ్
మాంచెస్టర్లో దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన టెస్టు మ్యాచ్ని మహేంద్ర సింగ్ ధోనీ ఫిక్స్ చేశాడని టీమిండియా మాజీ మేనేజర్ సునీల్ దేవ్ వెల్లడించినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ధోనీ మ్యాచ్ను ఫిక్స్ చేశాడని తాను చెప్పినట్లు ఓ హిందీ దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించడాన్ని సునీల్ దేవ్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా అవాస్తమని, తాను ధోనీపై అలాంటి వ్యాఖ్యలు చేయలేదని సునీల్ దేవ్ తేల్చి చెప్పాడు.
అంతేగాకుండా ఆ హిందీ పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని దేవ్ వ్యాఖ్యానించాడు. వాతావరణం మబ్బుపట్టి ఉన్న వేళ, తొలుత బ్యాటింగ్ చేయాలన్న నిర్ణయాన్ని తోసిరాజని ఫీల్డింగ్ను ఎంచుకోవడం వెనుక మ్యాచ్ ఫిక్స్ అయిందని సునీల్ చెప్పినట్టు ‘సన్ స్టార్’ అనే పత్రిక వెల్లడించింది. దీనిపై క్రీడా వర్గాల్లో దుమారం చెలరేగడంతో సునీల్ పైవిధంగా స్పందించాడు.