మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2016 (15:33 IST)

దేవతలనుకుంటున్నారా? మర్యాదగా దారిలోకి వస్తారా?: బీసీసీఐకి సుప్రీం వార్నింగ్

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. బీసీసీఐకి అక్షింతలు వేసింది. లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడంపై సుప్రీం కోర్టు బీసీసీఐపై కన్నెర్ర చేసింది. ఇందుల

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. బీసీసీఐకి అక్షింతలు వేసింది. లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడంపై సుప్రీం కోర్టు బీసీసీఐపై కన్నెర్ర చేసింది. ఇందులో భాగంగా బుధవారం లోథా కమిటీ సుప్రీంకోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. అందులో బీసీసీఐ అధ్యక్షుడితో పాటు ఇతర అధికారులను తొలగించే విషయంలో బీసీసీఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. 
 
ఈ నివేదికపై స్పందించిన సుప్రీం కోర్టు.. బీసీసీఐ అధికారులపై మండిపడింది. 'బీసీసీఐ అధికారులు తమను తాము దేవతలనుకుంటున్నారా? మర్యాదగా దారిలోకి వస్తారా? లేక దారిలోకి తీసుకురావాలా?' అని సుప్రీంకోర్టు హెచ్చరించింది. దీంతో బీసీసీఐలో ప్రకంపనలు మొదలయ్యాయి. రాజకీయాలతో సంబంధం ఉన్నవారిని బీసీసీఐ అధ్యక్ష, ఇతర స్థానాల్లో నియమించరాదని లోథా కమిటీ సిఫార్సు చేసింది.
 
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ వెలుగులోకి రావడంతో బీసీసీఐని ప్రక్షాళన చేసేందుకు సుప్రీం కోర్టు లోధా కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బోర్డు ప్రక్షాళనకు కమిటీ పలు సిఫార్సు చేసింది. కానీ ఈ కమిటీ సిఫార్సులను బీసీసీఐ తుంగలో తొక్కింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్‌తో పాటు ఇతర అధికారులపై వేటు వేయాలని కమిటీ కోరింది. 
 
బీసీసీఐ పట్టించుకోకపోవడంతో లోధా కమిటీ బుధవారం సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదికను విచారించిన సుప్రీం.. లోధా కమిటీ సిఫార్సులకు బోర్డు కట్టుబడి ఉండాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్టోబర్ 6న ఈ కేసును విచారించనున్నట్లు చీఫ్ జస్టిస్ టీఎస్ థాకూర్ చెప్పారు.