శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (14:37 IST)

ఈజీగా 75-80 సెంచరీలు కొట్టేస్తాడు.. కోహ్లీపై ప్రశంసల వర్షం

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పే సమయానికి ఆయన ఈజీగా కనీసం 75 నుంచి 80 సెంచరీలు కొట్టేస్తాడంటూ అనేక మంది క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించిన విషయం తెల్సిందే. 
 
ఈ సెంచరీ తర్వాత భారత టెస్ట్ మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ, 11 ఇన్నింగ్స్‌ల అనంతరం వెస్టిండీస్‌పై సెంచరీ సాధించి కోహ్లి తన పరుగుల దాహం తీర్చుకున్నాడని ప్రశంసించాడు. ప్రసుత ఫామ్‌ దృష్ట్యా టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి వన్డేల్లో సులువుగా 75-80 శతకాలు నమోదు చేస్తాడని జోస్యం చెప్పాడు. 
 
అంతేకాకుండా తన అంచనా తప్పకుండా నిజమవుతుందని ధీమా వ్యక్తంచేశాడు. టీమిండియా తరుపున 31 టెస్టులాడిన జాఫర్‌ 34.11 సగటుతో 1944 పరుగులు సాధించాడు. ఇందులో రెండు డబుల్‌ సెంచరీలు, ఐదు సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం జాఫర్‌ బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా సేవలు అందిస్తున్న విషయం తెల్సిందే.
 
అలాగే, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత క్రికెట్ జట్టు ఓటమి చెందడంపై ఆయన స్పందిస్తూ, కోహ్లీ కెప్టెన్సీని టెస్టులకే పరిమితం చేసి, రోహిత్‌ శర్మకు వన్డే, టీ20 కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని బీసీసీఐకి సూచించిన విషయం తెలిసిందే. ఇక వెస్టిండీస్‌పై సాధించిన శతకం కోహ్లీకి 42వది కావడం విశేషం. మరో ఎనిమిది సెంచరీలు సాధిస్తే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌(49) రికార్డును బ్రేక్‌ చేస్తాడు. ఇక ఇప్పటివరకు 238 వన్డేలు ఆడిన కోహ్లీ 59.91 సగటుతో 11,406 పరుగులు సాధించాడు. ఇందులో 42 శతకాలు, 54 అర్థసెంచరీలు ఉన్నాయి.