విరాట్ కోహ్లీని వెంటాడుతున్న ఆరెంజ్ క్యాప్ సెంటిమెంట్.. ట్రోఫీ ఎవరిది?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో గుజరాత్ లయన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో రాయల్స్ గెలుపును నమోదు చేసుకుంది. డివిలియర్స్ విజృంభించడంతో బెంగళూరు జట్టు విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు టైటిల్ గెలవని కోహ్లీ సేనకు ఈసారి కప్ గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రీడా పండితులు జోస్యం చెప్తున్న నేపథ్యంలో.. కోహ్లీని ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది.
ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు నెగ్గాలంటే కోహ్లీ ఒక్క విషయంలో జాగ్రత్త పడాల్సి వుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారట. అదేంటంటే, ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్కు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. కానీ ఆరెంజ్ క్యాప్ స్వీకరించే వారు వ్యక్తిగత స్కోర్ పరంగా రాణించినా.. ఫైనల్లో మాత్రం గెలుపొందిన దాఖలాలు లేవు.
ఇంకా చెప్పాలంటే.. సచిన్ టెండూల్కర్, క్రిస్ గేల్, షాన్ మార్ష్, మాథ్యూ హెడెన్, మైఖేల్ హస్సీ వంటి ఆటగాళ్లంతా ఆరెంజ్ క్యాప్ బాధితులే కావడంతో కోహ్లీని కూడా ఆరెంజ్ క్యాప్ సెంటిమెంట్ వెంటాడుతుంది. ప్రస్తుతానికి ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ కోహ్లీనే కావడం గమనార్హం. అయితే ఈ సెంటిమెంట్ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, 2014లో జరిగిన ఐపీఎల్లో కేకేఆర్ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఈ సెంటిమెంట్కు అతీతంగా నిలిచాడు.
ఆ సెషన్లో ట్రోఫీ నైట్ రైడర్స్దే. ఆరెంజ్ క్యాప్ను ఊతప్ప సొంతం చేసుకున్నప్పటికీ.. ట్రోఫీని ఆతడి జట్టు సొంతం చేసుకోవడం విశేషం. మరి కోహ్లీ విషయంలోనూ అదే జరుగుతుందో లేదో తెలియాలంటే ఫైనల్ మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే.