శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

చెత్త రికార్డును మూటగట్టుకున్న కోహ్లీ సేన... రెండో వన్డేలనూ తడబాటు

పటిష్టమైన ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ మరోమారు తడబడింది. ప్రత్యర్థి జట్టు ఉంచిన 390 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ సేన.. ఓపెనర్లతో పాటు.. శ్రేయాన్ అయ్యర్ వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం 26 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. భారత ఓపెనర్లలో అగర్వాల్ 28, ధవాన్ 30, శ్రేయాన్ అయ్యర్ 38 చొప్పున పరుగులు చేసి ఔట్ అయ్యారు. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ 58, కేఎల్ రాహుల్‌ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 
 
ఇదిలావుంటే, ఈ వన్డే సిరీస్‌లో భారత జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో ఆసీస్‌కు భారీ స్కోర్లు క‌ట్ట‌బెట్టిన కోహ్లి సేన‌.. ఈ క్ర‌మంలో తాను ఆడిన మొత్తం 978 వ‌న్డేల చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. 
 
వ‌రుస‌గా మూడు మ్యాచుల్లో ప్ర‌త్య‌ర్థి ఓపెన‌ర్లు టీమిండియాపై సెంచ‌రీకిపైగా భాగస్వామ్యం నెల‌కొల్ప‌డం ఇదే తొలిసారి. రెండు వ‌న్డేల్లోనూ ఆస్ట్రేలియా ఓపెన‌ర్లు వార్న‌ర్‌, ఫించ్ సెంచ‌రీ పార్ట్‌న‌ర్‌షిప్స్ నెల‌కొల్పారు. వీళ్లు తొలి వికెట్‌కు తొలి వ‌న్డేలో 156, రెండో వ‌న్డేలో 142 ప‌రుగులు జోడించారు. 
 
ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌తో జ‌రిగిన చివరి వ‌న్డేలో ఆ టీమ్ ఓపెన‌ర్లు మార్టిన్ గప్టిల్‌, హెన్రీ నికోల్స్ కూడా తొలి వికెట్‌కు సెంచ‌రీ పార్ట్‌న‌ర్‌షిప్ నెల‌కొల్పారు. ఈ సిరీస్‌లో 0-3తో టీమిండియా వైట్‌వాష్‌కు గురైంది. 1975 నుంచి వ‌న్డేలు ఆడుతున్న టీమిండియా గ‌తంలో ఎప్పుడూ ఇలా వ‌రుస‌గా మూడుసార్లు ప్ర‌త్య‌ర్థి ఓపెన‌ర్ల‌కు వంద‌కుపైగా భాగ‌స్వామ్యాలు నెల‌కొల్పే అవ‌కాశం ఇవ్వ‌లేదు.