మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (13:30 IST)

ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్... ఇండియా సెమీఫైనల్.. 23న భారతీయులు నిద్ర పోతారా?

మహిళల ట్వంటీ-20లో భారత మహిళల క్రికెట్ జట్టు రాణిస్తోంది. ఈ టోర్నీ సెమీఫైనల్లోకి టీమిండియా వుమెన్స్ జట్టు దూసుకెళ్లింది. తాజాగా మహిళల క్రికంట్ ప్రపంచ కప్ 2018 టోర్నీలో భాగంగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుతో భారత క్రికెట్ జట్టు తలపడనుంది. 2009లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. 
 
కానీ, భారత జట్టు మాత్రం లీగ్ మ్యాచ్‌లో తలపడిన అన్ని మ్యాచ్‌లలో విజయబావుటా ఎగురవేసింది. అంతేకాకుండా, గత ఏడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు చేతిలోనే భారత జట్టు ఓడిపోయింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా గట్టిపట్టుదలతో ఉంది. అంతేకాకుండా నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టును హర్మీత్ కౌర్ సేన చిత్తుగా ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉంది. 
 
ఇంకా ఇంగ్లండ్‌ను ఓడించిన వెస్టిండీస్ జట్టు తమ గ్రూపులో సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. గ్రూప్-ఏలో ఇంగ్లండ్ జట్టు రెండో స్థానంలో నిలిచింది. దీంతో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో తలపడనుంది. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్‌ను నియమించారు. ఈ టోర్నీలో ఈమె అద్భుతంగా రాణిస్తుండటంతో జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
 
ఈ నేపథ్యంలో సెమీఫైనల్ మ్యాచ్‌ను భారతీయులు వీక్షించాలంటే.. నిద్రను త్యాగం చేయాల్సి వుంటుంది. భారత కాలమానం గత నాలుగు మ్యాచ్‌లు  రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యాయి. కానీ తాజాగా ఇంగ్లండ్‌తో 23న జరిగే సెమీఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం ఐదు గంటల వరకు జరుగనుంది. దీంతో భారతీయులు వరల్డ్ వుమెన్ ట్వంటీ-20 సెమీఫైనల్ మ్యాచ్‌ కోసం నిద్రను పక్కన బెట్టి టీవీలకు అతుక్కుపోవాల్సి వుంటుంది. 
 
అయితే ఈ మ్యాచ్‌ను ఉదయం ఐదు గంటల వరకు నిర్వహించడంపై బీసీసీఐ గుర్రుగా వుంది. గతంలో 2010లో జరిగిన ట్వంటీ-20 పురుషుల వరల్డ్ కప్ (వెస్టిండీస్) మ్యాచ్‌ను డే టైమ్‌లో పెట్టగా, అది సాయంత్రం ముగిసింది. అలాగే ఇటీవల ఆసియా కప్ మ్యాచ్‌ కూడా రాత్రి ఏడు గంటలకు ఆరంభమై అర్థరాత్రి ముగిసింది. దక్షిణాసియా కాలమానం ప్రకారం క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ సమయం సర్దుబాటు అయ్యింది.
 
కానీ అనూహ్యంగా.. ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు రాణిస్తున్న నేపథ్యంలో.. ఆ మ్యాచ్‌ను మాత్రం అర్థరాత్రి పూట (భారత కాలమానం ప్రకారం) ప్రారంభించి ఉదయం ఐదు గంటలకు ముగించడంపై బీసీసీ పెదవి విరిచింది. 
 
భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ సమయం అనుకూలంగా వుండదని.. టీ-20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌ను చాలామంది వీక్షిస్తారని.. అలాంటి మ్యాచ్‌ను అర్థరాత్రి పూట జరపడం ఆర్గనైజర్లకు కూడా అంతగా వర్కౌట్ కాదని బీసీసీఐ అధికారులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.