వరల్డ్ కప్ 2015 టైటిల్ ధోనీ సేనదే : గ్యారీ కిర్స్టెన్ ధీమా
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ 2015 టైటిల్ను ఈసారి ధోనీ నాయకత్వంలోని టీమిండియా కైవసం చేసుకుంటుందని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ ధీమా వ్యక్తం చేశాడు.
ఈనల 15వ తేదీన పాకిస్థాన్తో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు.. ఈనెల 22వ తేదీన దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2011లో గెలుచుకున్న టైటిల్ను టీమిండియా నిలబెట్టుకుంటుందన్నారు. ఎవరెన్ని కథనాలు రాసినా, రాయకపోయినా... టీమిండియా విజయం మాత్రం ఖాయమని ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాలను ఆయన మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణించారు. ‘టీమిండియా టైటిల్ను నిలబెట్టుకుని తీరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. బలమైన బ్యాంటింగ్ లైనప్ వారి సొంతం. నాకౌట్ దశలో ఎలా ఆడాలన్న విషయం వారికి తెలుసు. 2011లో వారి ప్రదర్శన అద్భుతం’ అని కిర్ స్టెన్ వివరించాడు.