గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (19:44 IST)

వరల్డ్ కప్‌లో హోలీ గిఫ్ట్: విండీస్‌పై ధోనీసేన విన్.. క్వార్టర్ ఫైనల్లోకి ఎంట్రీ!

హోలీ కానుకగా టీమిండియా వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. వెస్టిండీస్‌పై ముందు తడబడిన భారత్ సేన.. తర్వాత నిలకడగా రాణించి కరేబియన్లను మట్టికరిపించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్‌కు కష్టాలు తప్పలేదు.

ముందుగా టాస్ గెలుచుకుని బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో హోల్డర్ (57), గేల్ (21), కార్టర్ (21), సామీ (26), టాయిలర్ (11) మినహా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఫలితంగా వెస్టిండీస్ 44.2 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు సాధించగా, యాదవ్, జడేజా చెరో రెండేసి వికెట్లు పడగొట్టగా, అశ్విన్, శర్మ చెరొక వికెట్ సాధించారు. 
 
తదనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఓపెనర్స్ శర్మ (7), ధావన్ (9) స్వల్ప స్కోరుకే అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. అయితే కోహ్లీ (33), రైనా (22), కెప్టెన్ ధోనీ (45 నాటౌట్)లు మెరుగ్గా రాణించడంతో టీమిండియా విజయబావుటా ఎగురవేసింది.

ఈ క్రమంలో 39.1 ఓవర్లలోనే ధోనీ సేన ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా 185 పరుగులు సాధించింది. విండీస్ బౌలర్లలో టాయిలర్ 2, రస్సెల్ 2, స్మిత్ 1, రోచ్ 1 వికెట్లు సాధించారు. కెప్టెన్ సమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.