సురేష్ రైనా... మెస్మరైజ్ షాట్లతో ఆలరించాడు : కెప్టెన్ ధోనీ
కార్డిఫ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో సురేష్ రైనా మెస్మరైజ్ షాట్లతో ఆలరించాడని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసించాడు. బుధవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్పై భారత్ విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే.
ఈ గెలుపుపై ధోనీ స్పందిస్తూ... కీలక దశలో రైనా ఎంతో వేగంగా ఆడాడని, ముఖ్యంగా సాధికారికమైన షాట్లతో ఇంగ్లండ్ బౌలర్ల పనిబట్టాడని తెలిపాడు. రైనా ప్రదర్శన ఇంగ్లండ్కు పరాజయం మిగిల్చిందన్నాడు. కాగా, ఈ ఇన్నింగ్స్తో రైనాకు వరల్డ్ కప్ బెర్తు ఖాయమైనట్టేనా..? అన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ, అతడు మెరుగైన ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే మరోరకంగా ప్రశ్నించి ఉండేవాళ్ళని చురకంటించాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదో వికెట్ కు రైనా-ధోనీ 144 పరుగులు జోడించడంతో భారీ స్కోరు సాధించడం తెలిసిందే. సెంచరీతో విరుచుకుపడిన రైనా సరిగ్గా 100 పరుగులు చేసి వెనుదిరిగాడు. 75 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో శతకం చేశాడు.