మా కుర్రోళ్లు చెత్తగా బ్యాటింగ్ చేశారు.. అందుకే చిత్తుగా ఓడాం : ధోనీ
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా మంగళవారం బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా చిత్తుగా ఓడిపోవడం పట్ల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనదైనశైలిలో స్పందించారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో బౌలర్లు రాణించక పోవడం వల్లే ఓడిపోయామని చెప్పిన ఈ జార్ఖండ్ ఆటగాడు.. ఇపుడు తమ బ్యాట్స్మెన్లు చెత్తగా బ్యాటింగ్ చేయడం వల్లే ఓడిపోయినట్టు చెప్పుకొచ్చారు.
ఈ మ్యాచ్ అనంతరం ధోనీ మీడియాతో మాట్లాడుతూ టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత మేం ఆశించిన విధంగా బ్యాటింగ్ చేశామని భావించడంలేదు. ఆరంభ ఓవర్లలో పిచ్ పేస్కు సహకరించగా, బ్యాట్స్మెన్ దీటుగా ఎదుర్కోలేకపోయారు. భాగస్వామ్యాలు నెలకొల్పాల్సి ఉన్నా, ఆ పనిచేయలేకపోయాం. వరల్డ్ కప్కు ముందు అందుబాటులో ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగపర్చుకోవాల్సి ఉంది. నాలుగున్నర నెలలుగా స్వదేశానికి దూరంగా ఉండటం కష్టంతో కూడుకున్న పని. అయితే, మేం అన్ని రకాల పరిస్థితులకు అనువుగా సర్దుకోవాల్సి ఉంటుందని సెలవిచ్చారు.