గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 20 జనవరి 2015 (15:01 IST)

బ్రిస్బేన్ వన్డే : చిత్తుగా ఓడిన భారత్.. 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం!

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్‌లో సమిష్టిగా రాణించి.. ఈ టోర్నీలో వరుసగా రెండో ఓటమిని చవిచూశారు. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు భారత్ నిర్ధేశించిన లక్ష్యాన్ని అలవోకగా చేధిస్తూ.. 9 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇంగ్లండ్ పేసర్లు ఫిన్ (5 వికెట్లు), ఆండర్సన్ (4 వికెట్లు) ధాటికి కకావికలమైంది. కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది. చివరికి 39.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్‌మెన్లలో రెహానే 33, ధవాన్ 1, రాయుడు 23, విరాట్ కోహ్లీ 4, సురేష్ రైనా 1, ధోనీ 34, స్టువర్ట్ బిన్నీ 44, ఏఆర్ పటేల్ 0, భువనేశ్వర్ కుమార్ 5, షమీ 1 చొప్పున పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో మరో ఏడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ 150 పరుగులైనా చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్ల స్వింగ్‌ను అంచనా వేయడంలో పొరబాటు పడిన భారత బ్యాట్స్‌మెన్లు షాట్ల ఎంపికలో నిర్లక్ష్యం కనబరిచి తగిన మూల్యం చెల్లించుకున్నారు. 
 
అనంతరం 154 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. అలవోకగా, కేవలం 27.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి చేధించింది. ఫలితంగా తొమ్మిది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఓపెనర్‌గా బరిలో దిగిన ఇయాన్ బెల్ (88 నాటౌట్) ధాటిగా ఆడడంతో భారత్‌కు మరో పరాభవం తప్పలేదు. అతనికి తోడు టేలర్ (56 నాటౌట్) కూడా సమయోచితంగా రాణించడంతో ఇంగ్లండ్ జట్టు సిరీస్‌లో తొలి విజయం నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ మొయిన్ అలీ (25) వికెట్ మాత్రమే పతనం కాగా, ఆ వికెట్ స్టూవర్ బిన్నీ ఖాతాలో చేరింది. బెల్ చెలరేగడంతో ఇంగ్లండ్ జట్టు కేవలం 27.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' ఫిన్‌కు దక్కింది.