గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 31 జులై 2014 (10:47 IST)

ఇంగ్లండ్‌‌తో మూడో టెస్ట్ : ఓటమి అంచున భారత్!

లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో విజయభేరీ మోగించిన భారత క్రికెట్ జట్టు ఇపుడు సౌతాంప్టన్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి కోరల్లో చిక్కుకుంది. మూడో టెస్టులో విజయానికి 445 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత్ టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. 
 
లక్ష్య ఛేదనలో ఇప్పటికే విజయ్‌ (12), ధవన్‌ (37), పుజారా (2), కోహ్లీ (28) వికెట్లను భారత్‌ త్వరత్వరగా కోల్పోయింది. భారత్ ఈ మ్యాచ్‌లో డ్రాతో గట్టెక్కాలంటే రహానె, రోహిత్‌ శర్మ, కెప్టెన్‌ ధోనీలతో పాటు టెయిలెండర్లు కూడా అసాధారణంగా పోరాడాల్సిందే! లేకపోతే.. ఈ మ్యాచ్‌లో ఓటమి ఖాయం. 
 
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 239 పరుగులు భారీ ఆధిక్యం చేతిలో ఉంచుకుని, భారత్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్... ఓ ప్రణాళిక ప్రకారం వేగంగా ఆడింది. అలిస్టర్‌ కుక్‌ (70 నాటౌట్‌), రూట్‌ (56) రాణించడంతో.. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ను 205/4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఫలితంగా 445 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది.