భారత్కు ఘోర పరాజయం : 266 పరుగులతో ఇంగ్లండ్ విజయభేరీ!
సౌతాంఫ్టన్ టెస్టులో ధోనీ సేన చిత్తుగా ఓడింది. క్రికెట్ ఆఫ్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో విజయభేరీ మోగించిన భారత క్రికెట్ జట్టు సౌతాంఫ్టన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు ఏకంగా 266 పరుగుల తేడాతో భారత్ను చిత్తుగా ఓడించి లార్డ్స్ మైదానంలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది.
ఈ టెస్టులో విజయానికి 445 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో కూడా భారత్ టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. లక్ష్య ఛేదనలో ఇప్పటికే విజయ్ (12), ధవన్ (37), పుజారా (2), కోహ్లీ (28) వికెట్లను భారత్ త్వరత్వరగా కోల్పోయింది.
ఆ తర్వాత ఐదో రోజు బ్యాటింగ్ చేపట్టిన ధోనీ (6), రోహిత్ శర్మ (6), రహానే (52 నాటౌట్), జడేజా (15), భవనేశ్వర్ కుమార్ (0), షమీ (0), పంకజ్ సింగ్ (9)లు త్వరత్వరగా ఔట్ కావడంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్లో 178 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 266 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. తొలి ఇన్నింగ్స్లో ఐదు, రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లను తీసిన ఆండర్సన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే, రెండో ఇన్నింగ్స్లో అలీ ఆరు వికెట్లు తీసి భారత్ వెన్ను విరిచాడు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో 239 పరుగులు భారీ ఆధిక్యం చేతిలో ఉంచుకుని, భారత్కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్... ఓ ప్రణాళిక ప్రకారం వేగంగా ఆడింది. అలిస్టర్ కుక్ (70 నాటౌట్), రూట్ (56) రాణించడంతో.. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ను 205/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా 445 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించిన విషయం తెల్సిందే.
మూడో టెస్ట్ మ్యాచ్ సంక్షిప్త స్కోరు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ : 569/7 డిక్లేర్.
భారత్ తొలి ఇన్నింగ్స్ : 330 ఆలౌట్.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 205/4 డిక్లేర్.
భారత్ రెండో ఇన్నింగ్స్ : 178 ఆలౌట్.
ఫలితం : 266 రన్స్ తేడాతో ఇంగ్లండ్ విజయం.